ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళతాం
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
న్యూదిల్లీ, మే 26 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోమవారం దిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఓబీసీ ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వల్లనే కులగణన సాకారం కాబోతుంది.. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపడం, తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యాం అని ఆయన పేర్కొన్నారు. రాహల్ గాంధీ డిమాండ్, ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా కుల గణనకు నిర్ణయం తీసుకుంది.. అయితే, దేశ వ్యాప్తంగా కుల గణన చేసేందుకు కేంద్ర బడ్జెట్ లో రూ. 500 కోట్లు మోడీ ప్రభుత్వం కేటాయుంపులు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.కానీ, దేశంలో కుల గణన చేసేందుకు సుమారు 8 వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా ఉందని మంత్రి పొన్నం తెలిపారు. పైగా, కుల గణన పూర్తికి నిర్దిష్ట కాలపరిమితి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించలేదు.. అందుకనే, కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబీసీ నేతల అభిప్రాయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అన్ని అంశాలపై చర్చించి, తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు. లక్షల సంఖ్యలో పెద్ద ఓబీసీ ర్యాలీని కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.





