– జర్మనీ ప్రతినిధి బృందంతో డిప్యూటి సీఎం భట్టి, మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్12: ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో భారీ పెట్టుబడుల అవకాశాలు ఉన్నాయని, జర్మన్ కంపెనీలు రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్ దృష్టితో నిర్మాణంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవనం, వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి వంటి ప్రాజెక్టుల్లో కూడా జర్మన్ సంస్థలకు కీలక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ, జర్మనీ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా శుక్రవారం ప్రజాభవన్లో కీలక సమావేశం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి జర్మనీ పార్లమెంట్ ప్రతినిధి బృందంతో విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఐటీ, డిఫెన్స్, ఫార్మా, మెటలర్జీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి కీలక రంగాల్లో సంయుక్త భాగస్వామ్యానికి మార్గాలు అన్వేషించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జర్మనీతో తెలంగాణకు ఉన్న సుదీర్ఘ స్నేహ బంధాన్ని గుర్తుచేశారు. తెలంగాణ యువతను జర్మనీ పరిశ్రమలకు అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా జర్మన్ లాంగ్వేజ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తే, జర్మనీలో ఉన్న ఉపాధి అవకాశాలు తెలంగాణ విద్యార్థులకు మరింత చేరువవుతాయని వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందు వరుసలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు జర్మన్ బృందానికి వివరించారు. హైదరాబాద్ సైబర్ ఎక్సలెన్స్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనిట్లు, జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేస్తున్న సైబర్ సెక్యూరిటీ వింగ్స్, ఆర్థిక నేరాలను ఎదుర్కొనే ఆధునిక ఈ చర్యలు తెలంగాణను దేశంలోనే అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ హబ్గా నిలిపాయని పేర్కొన్నారు. ఈ రంగంలో జర్మనీ భాగస్వామ్యం రాష్ట్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్తుందని ఆయన తెలిపారు. సమావేశంలో పాల్గొన్న జర్మన్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి రంగంలో స్పష్టమైన లక్ష్యాలు, నిర్మాణాత్మక ప్రణాళికలు ఉండటం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. సైబర్ సెక్యూరిటీ, స్కిల్డ్ లేబర్ ఎక్స్చేంజ్, విద్య, పరిశ్రమల రంగాలలో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. జర్మన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇప్పటికే భారతదేశంలో జర్మనీ పెట్టుబడులు భారీ స్థాయిలో ఉన్నాయని, ముఖ్యంగా బోష్ వంటి మెగా కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం జర్మనీలో 60,000 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని, తెలంగాణ యువత ప్రతిభ అంతర్జాతీయంగా అత్యంత గుర్తింపు పొందుతోందని వ్యాఖ్యానించారు. ఎనిమిది మంది జర్మన్ పార్లమెంట్ సభ్యులతో పాటు సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ తరఫున ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇందన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, జెన్కో సీఎండీ హరీష్, ప్రణాళిక శాఖ సెక్రటరీ బుద్ధప్రకాశ్ జ్యోతి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.