-ఈ దశలో స్టే విధించలేం
-స్టే ఎలా విధిస్తాం?
పిటిషనర్ను ప్రశ్నించిన ధర్మాసనం
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు రు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా..? అని పిటీషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీ.ఓ- 46పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 42 శాతం రిజర్వేషన్ జీ.ఓ విచారణ సమయంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పినట్లు హైకోర్టు గుర్తు చేసింది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ను రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా.. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వొకేట్ చెప్పుకొచ్చారు. అయితే, ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని మరోసారి స్పష్టం చేసింది. తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి, తామే స్టే ఎలా ఇస్తాం. అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. అందుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. సబ్ కేటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం హుకుం జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ గురువారం వెనుకబడిన కులసంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికల పక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
————–





