జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్కు సవాల్గా మారనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సరిగ్గా 23 నెలల కింద అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్పార్టీ ప్రజలకిచ్చిన హామీలు ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిబంధకమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ ఈసారి ప్రజల తీర్పును ఎవరూ అంచానా వేయలేకపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంవల్ల గెలుపు ఆ పార్టీకే లభిస్తుందన్న వాదన ఒకటుంది. అయితే కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందన్న విషయాన్ని బిజెపి, బిఆర్ఎస్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో బిఆర్ఎస్ అయితే వినూత్న ప్రచారానికి తెరదీసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు ఏ మేరకు నష్టపోయారన్న విషయాన్ని ‘బాకీ కార్డు’ల రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోతున్నారు. ఈ కార్డును చూసిన వారికి నిజంగానే రేవంత్రెడ్డి ప్రభుత్వం తమకు ఏమేరకు బాకీ పడిందన్న విషయాన్ని ఆలోచింపజేసేదిగా ఉంది.
ప్రధానంగా రైతులకు అందిస్తామన్న రైతు భరోసా, రుణమాఫీ హామీలను ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వ్యవసాయరంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందనడానికి యూరియా కోసం రైతులు పడిన తంటాలు నిత్యం మీడియాలో కథలు కథలుగా రావడం రాష్ట్ర ప్రభుత్వంపై రైతాంగానికి ఆగ్రహం తెప్పించిన విషయం. గత ఎన్నికల్లో అడబిడ్డల పెండ్లిండ్లకు తులం బంగారం ఇస్తామన్నది వారిని బాగా అకట్టుకుంది. ఈ పథకాన్ని ప్రకటించడంద్వారా కాంగ్రెస్కు వోట్ల రూపంలో లబ్ధి పొందింది. దానితోపాటు వారికి 2500 రూపాయల పించను ఇస్తామన్న హామీకూడా వారిని బాగా ఆకట్టుకుంది.
వీటితోపాటుగా గృహజ్యోతి, పిల్లలకు స్కూటీలు, చివరకు బతుకమ్మ చీరల విషయంలోకూడా కాంగ్రెస్ విఫలమైందన్న ప్రచారాన్ని బిఆర్ఎస్, బిజెపిలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. మహిళకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వోట్లు దండుకోవాలని చూస్తున్నదని, కాని నిత్యం ఆ బస్సుల్లో మహిళ మధ్య పోట్లాటలు జరుగడాన్ని గమనించలేకపోతున్నదంటున్నారు. మహిళల్లో చాలామంది అసలు ఉచిత బస్సు సదుపాయం అవసరమేలేదన్న వాదన వినిపిస్తున్నారు. ఈ ఉచిత బస్సు కారణంగా ఆర్థికంగా నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోలేకపోతున్నదని ఆటో డ్రైవర్స్ మండిపడుతున్నారు.