- కొందరిని అరెస్ట్ చేసినా భయపడేది లేదు
– పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపు
గజ్వేల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు.. భయపడ వద్దని వారికి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరంపై కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్పై కమిషన్ నివేదికను పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ చేశారు. అదే సమయంలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదేనని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను నిర్మించారు. అయితే 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం ఈ ప్రాజెక్ట్లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్ విచారణ జరిపింది. చివరకు జులై 31వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఆగస్టు 1వ తేదీన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ నివేదికపై ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆదివారం సమావేశమై.. చర్చింది. ఈ కమిటీ అందించిన నివేదికపై తెలంగాణ సచివాలయంలో సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అదీకాక లక్షల కోట్ల రూపాయిలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది.





