–కెసిఆర్ తదితరులకు నోటీసులు
– జూన్ 5న విచారణకు రావాలిన ఆదేశం
– 6న హరీష్ రావు, 9న ఈటల హాజరుకు నోటీస్లు
కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచింది. ఇంతకాలం అధికారులను విచారించిన కమిషన్ ఇప్పుడు ఇందులో కీలకంగా ఉన్ననేతలను విచారణకు పిలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కూ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరుకావాలని కోరింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరుకావాలని కోరింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్.. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీకంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులు… ఇలా అందరినీ విచారించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది. గత నెలాఖరులో ఒక నెల మాత్రమే గడువు పొడిగించింది. దీనిప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తికావాలి. ఈ నెల 21న లేదా 22న జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే విచారణలో.. సీనియర్ ఇంజినీర్లు, అధికారుల్లో ఎక్కువమంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలను అమలుచేశామని చెప్పిన నేపథ్యంలో.. వీటిపై కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం నిర్మాణం వ్యవహారం లో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ను ఏర్పాటు చేసింది.
దాదాపు ఏడాదిన్నరగా కమిషన్ విచారణ కొనసాగుతోంది. కమిషన్ విచారణ గడువు ఈ నెలాఖరితో ముగియనుంది. అయితే కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలపాటు అంటే జూలై 31 వరకు పొడిగిచింది. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డీఈలు, ఎస్ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్లరూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి.. వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది. ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించింది. అలాగే ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ విచారణ చేసింది. ఈ ఏడాది పాటు సుదీర్ఘంగా జరిపిన ఈ విచారణలో దాదాపు అందరూ కూడా కేసీఆర్ పేరే చెప్పినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారని వేసిన ప్రశ్నకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరునే ప్రస్తావించినట్లు సమాచారం.
స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రమేయంతో జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వచ్చిన వివరాలతో ఓ నివేదికను కూడా సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నివేదిక ఇస్తే బీఆర్ఎస్ తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని భావించిన కమిషన్.. కేసీఆర్ను స్వయంగా విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేసీఆర్ సహా హరీష్, ఈటలకు నోటీసులు పంపించింది. అయితే కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేక న్యాయపరంగా ఎదుర్కొంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.



