ఉదయం సమావేశమై ఖరారు చేసిన విపక్ష నేతలు
న్యూదిల్లీ, ఆగస్ట్ 19 : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి (Vice Presidential candidate) ని పోటీకి నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన విశ్రాంత జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు చేసింది. జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి.. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2007 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి విధులు నిర్వహించారు. ఆ తర్వాత గోవా లోకాయుక్తగా సైతం ఆయన పని చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామం. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని మోదీ ప్రభుత్వంలోని పలువురు కేంద్ర మంత్రులు పిలుపునివ్వగా, ఇండియా కూటమి నీళ్లు చల్లింది. ఆ క్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తీసుకువొచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాదికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు సీపీ రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇండియా కూటమి సైతం ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని భావించింది. అందులోభాగంగా తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఎవరూ ఊహించని విధంగా తెరపైకి తీసుకు వొచ్చింది. మంగళవారం న్యూదిల్లీలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.





