– కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, కాంగ్రెస్ నేతలు
దిల్లీ, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (Prof. Jayashankar) జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth) దిల్లీలోని తన అధికారిక నివాసంలో నివాళులర్పించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను గుర్తు చేసుకున్నారు.
బీసీ కమిషన్ కార్యాలయంలో..
హైదరాబాద్: జయశంకర్ 91వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బీసీ కమిషన్ (BC commission) కార్యాలయంలో కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మిలు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ మనోహర్, డిప్యూటి డైరెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ సతీష్ కుమార్, రీసెర్చ్ అసోసియేటర్ లక్ష్మీనారాయణ, కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ నిరంజన్ జయశంకర్ సేవలను గుర్తు చేసుకుంటూ తన జీవితాంతం వరకు తెలంగాణ అస్థిత్వం, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ వనరుల రక్షణ కోసం పాటుపడ్డారని తెలిపారు. ఆయన తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో కీలక పాత్ర వహించారని, ఆయన స్ఫూర్తితో ఈ తరం తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చింది. అలాగే ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కమిషన్ నివాళులర్పించింది. వారికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.





