హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 38 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. మృతుల్లో ఎక్కువగా జార్ఖండ్కు చెందిన వారు ఉన్నారని తెలిపారు. గుర్తించలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన తర్వాతనైనా ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. ఈ ప్రమాదంలో సిగాచీ యాజమాన్యం తప్పిదం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేపట్టాలి: ఓవైసీ





