ఇది పరిమాణాత్మక మార్పు, మరి గుణాత్మక మార్పు గురించి ఏమిటి?
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం ఇటీవల 2025లోభారతదేశం అధికారికంగా జపాన్ను అధిగమించి 4.187 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి (GDP)తో ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నీతి ఆయోగ్ (NITI AAYOG) ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం ఈ పరిణామాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రపంచ ఆర్థికవ్యవస్థ ర్యాంకింగ్స్లో ఇప్పుడు అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారతదేశం కంటే ముందున్నాయని పేర్కొన్నారు. సాంకేతిక పురోగతి, బలమైన దేశీయ వినియోగం, వ్యూహాత్మక విధాన సంస్కరణలు, పెరుగుతున్న ప్రపంచ వాణిజ్యం, తయారీ ద్వారా నడిచే బలమైన ఆర్థిక వృద్ధి భారతదేశం ఈ విజయం ను ప్రతిబింబిస్తున్నాయి. ఈ విజయం ‘మేక్ ఇన్ ఇండియా’, తో పాటు ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాల(PLI) పథకాల ప్రభావాన్ని నొక్కి చెబుతుంది.
ఇవి తయారీ మరియు ఎగుమతులను బలోపేతం చేశాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఆవిష్కరణ, నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తి, నైపుణ్య మెరుగుదలపై నిరంతర దృష్టితో భారతదేశం రాబోయే సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యంతో సిద్ధంగా ఉంది. ఈ స్థిరమైన వృద్ధి 2028 నాటికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 5.58 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లకు పెంచుతుందని, తద్వారా జర్మనీని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని అంచనా.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మనం గమనించినప్పుడు, 1950- 1970ల మధ్య ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా నెమ్మదిగా ఏటా సగటున 3.1%వృద్ధి చెందింది. 1980లలో ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి సగటున 5.5% వృద్ధి చెందడంతో గణనీయమైన మెరుగుదల కనిపించింది. 1990-2000 దశకం ఆర్థిక సరళీకరణ, సంస్కరణల కాలం. ఇది మరింత వృద్ధికి దారితీసింది. 2000 నుండి భారతదేశం వేగవంతమైన వృద్ధిని సాధించింది, కొన్ని సంవత్సరాలలో సగటు వార్షిక వృద్ధి రేట్లు 8% మించిపోయాయి. వీటన్నింటికీ కీలకమైన అంశాలు ఆర్థిక సరళీకరణ (1991), పెట్టుబడి రేట్లు, పారిశ్రామికీకరణ, సేవా రంగ వృద్ధి మొదలైనవి కీలక పాత్ర పోషించాయి. ఆర్థికాభివృద్ధి నిరంతర ప్రక్రియ కాబట్టి మనం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారవచ్చు. భారతదేశం ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలలో ఒకటిగా మారుతున్నందున మనం గర్వపడాలి. ఈ పరిమాణాత్మక మార్పును అభినందించాలి. అదే సమయంలో, మనకు వివిధ రంగాలు, అంశాలలో కూడా గుణాత్మక మార్పు అవసరం.
మరోవైపు మన భారత ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, పర్యావరణ క్షీణత, మౌలిక సదుపాయాల కొరత, వ్యవసాయంపై అధిక ఆధారపడటం, ఆదాయ అసమానతలు, తక్కువ విద్యా ప్రమాణాలు, తగినంత నైపుణ్య అభివృద్ధి లేకపోవడం వంటి అనేక ముఖ్యమైన అడ్డంకులను ఎదుర్కొంటోంది, ఇవి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. బలహీనమైన డిమాండ్, పెట్టుబడి లేకపోవడం, విదేశీ పెట్టుబడులపై ఆధారపడటం కూడా మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్లు. దాదాపు 50% మంది భారతీయ శ్రామిక శక్తి వ్యవసాయంలో పనిచేస్తోంది, కానీ ఈ రంగం స్థూల దేశీయోత్పత్తి (GDP)కి కేవలం 18% మాత్రమే దోహదం చేస్తుంది. మరోవైపు, సమాచారం మరియు సాంకేతికత (IT), ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వంటి సేవా రంగాలు స్థూల దేశీయోత్పత్తి (GDP)కి 50శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో 30శాతం మంది శ్రామిక శక్తి మాత్రమే కేంద్రీకృతమై ఉన్నది. క్లియర్ టాక్స్ నివేదిక ప్రకారం, 2025లో భారతదేశ తలసరి ఆదాయం సుమారు 2,880 అమెరికన్ డాలర్లు గా అంచనా వేయబడింది.
2023 నాటికే ప్రపంచ తలసరి స్థూల దేశీయోత్పత్తి (GDP) 13,138 అమెరికన్ డాలర్లు గా అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2024లో, భారతదేశంలో తలసరి నికర ఆహార ధాన్యాల లభ్యత రోజుకు దాదాపు 568 గ్రాములుగా అంచనా వేయబడింది. ఈ సంఖ్యలో బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, ఇతర తృణధాన్యాలు, వివిధ పప్పుధాన్యాలు ఉన్నాయి. భారతదేశం తన తలసరి ఆహార ధాన్యాల లభ్యతను పెంచుకున్నప్పటికీ, అది ఇప్పటికీ అమెరికా( US) కంటే తక్కువగానే ఉంది, అమెరికా(US)తలసరి ఆహార ధాన్యాల లభ్యత 1,100 కిలోలకు పైగా ఉంది. 2024లో, భారతదేశంలో ప్రతి 10,000 మందికి దాదాపు 13.4 మంది వైద్యులు ఉన్నారు





