– నిందితులందరినీ పిలిచి విచారించిన ‘సిట్’
-పెన్డ్రైవ్ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం
– నిశాంత్రావు ఆర్థిక లావాదేవీలపై ఆరా
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్25: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. రెండ్రోజుల క్రితమే ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకిషన్రావు, తిరుపతన్నలను పిలిచిన ‘సిట్’ వారిని విచారించింది.
ప్రభాకర్ రావు కస్టోడియల్ దర్యాప్తు గురువారంతో ముగియనుండటంతో అందిరితో కలిపి ఆయనను విచారిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ‘సిట్’ అధికారి, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ‘సిట్’ ఆఫీసుకు చేరుకున్నారు. ప్రభాకర్ రావు 14 రోజుల విచారణ ముగియనుండగా శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు. అయితే 14 రోజుల కస్టడీలో ప్రభాకర్రావు ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు ఎస్ఐబీ మాజీ చీఫ్ సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ కేసుకు సంబంధించి పెన్డ్రైవ్ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. అందులో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు గుర్తించింది. ఈ డేటాను ముందు పెట్టి మరీ విచారించింది. అయితే ఆరు వేల ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్డ్రైవ్పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇవ్వనట్లు సమాచారం. ప్రణీత్రావు, ప్రభాకర్రావును కలిపి విచారించిన అధికారులు ప్రభాకర్రావు కుమారుడు నిశాంత్రావు ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రశ్నించారు. ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణ ముగియనుండటంతో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ను కూడా సిట్ విచారించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ గతంలో అరెస్టయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. దీంతో నందకుమార్ వాంగ్మూలాన్ని ‘సిట్ ‘ రికార్డు చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



