డిఎన్ఎ అనంతరం శవాల అప్పగింత
మృతుల కుటుంబాలకు తక్షణం లక్ష రూపాయలు అందచేత
పటాన్చెరు,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం ఘటనలో మృతిచెందిన కార్మికుల కుటుంబీకులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతిచెందగా.. 13 మందిని గుర్తించారు. వారి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రూ.లక్ష చొప్పున తక్షణ సాయాన్ని అందజేశారు. క్షతగాత్రులకు 50వేలు అందించారు. అయితే ఇది తాత్కాలిక తక్షణ సాయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇదిలావుంటే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ప్రభుత్వ హాస్పి•ల్లో మార్చురీలో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. పటాన్చెరువు సర్కారు దవాఖానలోని మార్చురీలో ఉన్న మృతదేహాలు చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏ మృతదేహం ఎవరిదో తెలియక మార్చురీ దగ్గర కార్మికుల కుటుంబాలు ఎదురు చూసాయి. డీఎన్ఎ రిపోర్ట్ వచ్చిన తర్వాత వైద్య శాఖ అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే, ఇప్పటి వరకు పటాన్ చెరువు మార్చురీలో గుర్తించిన మృతదేహాలకు డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు.కాగా, పోస్టుమార్టం పూర్తి అయిన 11 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు నలుగురు ఉండగా తెలంగాణకు చెందిన వారు ఒకరు.. ఒరిస్సా కు చెందిన వారు ముగ్గురు, బీహార్ కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు.





