– సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన ధర్మాసనం
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆర్ఎన్ఎ): గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో.. గ్రూప్ 1 నియామకాలపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను పునః మూల్యాంకనం చేయాలని నాడు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుది తీర్పునకు లోబడి గ్రూప్ 1 నియామకాలు చేపట్టవచ్చని ఇప్పటికే గతంలో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది.
తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా: రేవంత్రెడ్డి
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563మంది గ్రూప్-1 అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్-1 అధికారులుగా మీరు నియమితులయ్యారంటూ ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని సీఎం పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




