గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ హబ్‌గా హైదరాబాద్‌

– హైదరాబాద్‌లో హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ జీసీసీ ప్రారంభం
– అమెరికా వెలుపల భారత్‌లో మొట్టమొదటిది ఇదే
– 75 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి.. 3వేల మందికి ఉద్యోగాలు
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: హైదరాబాద్‌ను గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాచ్‌సీఏ హెల్త్‌కేర్‌ సంస్థ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను రాయదుర్గంలో బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ ప్రధానంగా అమెరికా, యూకేలలో కార్యకలాపాలను నిర్వహిస్తుండగా ఈ సంస్థకు 190 హాస్పిటల్స్‌, 2,400 కేర్‌ సైట్లు ఉన్నాయి. మొత్తం 3.16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.. అని మంత్రి వివరించారు. ఇలాంటి దిగ్గజ సంస్థ అమెరికా వెలుపల భారత్‌లో తన మొట్టమొదటి జీసీసీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణను ఎంచుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఇది హైదరాబాద్‌కున్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నిదర్శనం అని పేర్కొన్నారు. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో హెచ్‌సీఏ హెల్త్‌ కేర్‌ 75 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.620 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ జీసీసీ కేవలం ఉపాధి అవకాశాలను సృష్టించడమేకాక ఆరోగ్య సంరక్షణలో నాణ్యత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు. ఐటీ, సప్లై చైన్‌, ప్రొక్యూర్‌మెంట్‌, మానవ వనరులు, ఫైనాన్స్‌, అకౌంటింగ్‌ తదితర విభాగాల్లో ప్రస్తుతం 1200 మందికి, 2026 నాటికి మూడు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి అని చెప్పారు. హైదరాబాద్‌ గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ ఫార్మాస్యూటికల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు ముఖద్వారంగా ఎదుగుతుందని, ప్రపంచస్థాయి హాస్పిటల్స్‌, 800కు పైగా ఫార్మా కంపెనీలు, ప్రముఖ గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ జీసీసీలు, అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ హబ్‌గా రూపాంతరం చెందుతుందని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూనే సరసమైన ఆరోగ్య సంరక్షణను ప్రపంచానికి అందిస్తుంది అని చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్‌ సీఎస్‌ సంజయ్‌ కుమార్‌, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌, ఐటీ సలహాదారు సాయికృష్ణ, హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మైక్‌ మార్క్స్‌, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎమిలీ డంకన్‌, హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ కపూర్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *