కాంగ్రెస్‌ వచ్చాక ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణం

– హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలి
– జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్‌కు బుద్ధొస్తది
– మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం
– ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్‌కు ఆటో ప్రయాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో రూ.12000 ఇస్తామని పేర్కొని మోసం చేసింది.. ఆటో సంక్షేమ బోర్డు, ఆటో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోనగర్‌ అసలే లేదు. ప్రమాద బీమా రూ.10 లక్షలు పెంచుతామని పత్తా లేదని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారంలో యూసఫ్‌గూడలో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆటోల నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఓడిపోతే రేవంత్‌ రెడ్డికి బుద్ధి వచ్చి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడన్నారు. మద్యం టెండర్లపై రూ.3 లక్షల ఫీజు పెంచితే ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల ఆదాయం వచ్చింది.. అందులోనుంచి రూ.1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి వారిని కాపాడాలి అని డిమాండ్‌ చేశారు. ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌ నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో హరీష్‌రావు సోమవారం ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా రెండేళ్లలో ప్రతి కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలు చొప్పున(ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలకు) మొత్తం రూ.1500 కోట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 161 మంది ఆటో కార్మికులు చనిపోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఒక్కో ఆటో డ్రైవర్‌ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఆటో డ్రైవర్లు అంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు? లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తున్నాం.. లక్ష కోట్లతో ఫోర్త్‌ సిటీ నిర్మిస్తాం అంటున్నావు కానీ ఆటో డ్రైవర్లకు నెలకు రూ.వేయి ఇవ్వలేవా రేవంత్‌రెడ్డీ అని నిలదీశారు. మీ తరపున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆటో డ్రైవర్లకు హరీష్‌రావు హామీ ఇచ్చారు. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం.
జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో ఆటో కార్మికులు ఎక్కడున్నా కాంగ్రెస్‌ని ఓడిరచేందుకు పనిచేయండి అని పిలుపునిచ్చారు.

హరీష్‌ రావు ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ రమేష్‌..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ల జీవితం బాగుండేది. రేవంత్‌ రెడ్డి మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టాడు. ఆటో డ్రైవర్లు అప్పుల బాధతో చనిపోతున్నారు. వారి కుటుంబాలు దిక్కులేనివి అవుతున్నాయి.. హరీష్‌రావు తమకు సంఫీుభావంగా ఆటోలో ప్రయాణించారు. రోజుకి రూ.500 ఇప్పుడు వస్తున్నాయి. గతంలో రూ.1500 నుండి రూ.2 వేల వరకు వచ్చేవి. సంవత్సరానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.12000 ఇస్తామని చెప్పి మోసం చేసింది.

మరో ఆటో డ్రైవర్‌ షేక్‌ నజీబ్‌
నా కొడుకుకు ఆరోగ్యం బాగా లేక నిలోఫర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించాము. మందులు బయట కొనుక్కొని తేవాల్సి వస్తున్నది. కేసీఆర్‌ ఉన్నప్పుడు బాగుండేది. మా ఆటో డ్రైవర్ల జీవితాలు బాగుండేవి. కేసీఆర్‌ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు వచ్చింది. షాదీ ముబారక్‌ వచ్చింది. రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్కటీ అమలు కాలేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడిస్తాం. ఒక్కొక్క ఆటో డ్రైవర్‌ పదిమందిని తీసుకెళ్లి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయిస్తాం. మాగంటి సునీతను గెలిపిస్తాం. గత పదేళ్లల్లో ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉండేటోళ్లు. పోలీస్‌ వేధింపులు, చలాన్లు కట్టే పరిస్థితి లేకుండె. ఇప్పుడు పోలీసులకు చలాన్లు కట్టడానికి మా సంపాదన సరిపోతున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *