– తక్కువ వలసలు ఉన్న దేశాలకు ప్రాధాన్యం
– 2028 వరకు యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీకి దూరం
– భారతీయులు లక్ష్యంగా అమెరికా మరో నిర్ణయం
వాషింగ్టన్,అక్టోబర్17: ట్రంప్ రెండోసారి అధికారంలోకి వొచ్చినప్పటినుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకాశం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమంలో గత ఐదేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను ఎంచుకుంటున్నట్లు తెలిపాయి. ఏటా 50 వేల మంది లోపు అమెరికాకు వలసవచ్చే దేశాలకే అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. అమెరికాలో అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీసా లాటరీలో పాల్గొనడానికి అనుమతి ఉన్న దేశాలకు తాజా వీసా కేటాయింపులను ప్రకటించారు. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు అధికంగా వలసలు ఉండడంతో భారతీయులకు ఈ వీసా కార్యక్రమానికి కావాల్సిన అర్హత పరిమితి మించిపోయిందని.. అందువల్లే ఈ లాటరీలో పాల్గొనడానికి వారికి అవకాశం ఇవ్వట్లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. యూరోపియన్ (75,610) వలసదారుల సంఖ్య కంటే ఎక్కువ. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వచ్చారు. ఈ రికార్డుల ఆధారంగా 2028 వరకు భారతీయులను యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీలకు అనర్హులుగా నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ విధానంలో అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఈ లాటరీకి 2026 వరకు అర్హత సాధించని ఇతర దేశాల్లో చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ ఉన్నాయి. పెరోల్ ఫీజుపై అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కొన్నిరకాల వలసదారులకు అవసరమయ్యే పెరోల్ ఫీజును 1,000 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. వీసా లేదా ఇతర అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించడానికి, ఉండటానికి పెరోల్ అనేది తాత్కాలిక అనుమతి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిపై విదేశీయులను అమెరికాలోకి అనుమతిస్తారు.ఇటీవల ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఈ పెరోల్ ఫీజును తప్పనిసరి చేశారు. ప్రస్తుతం దీని ఆధారంగా అమెరికాలోకి ప్రవేశించాలంటే విదేశీయులు 1,000 డాలర్ల పెరోల్ రుసుమును చెల్లించాలి. వీటిలో ప్రారంభ పెరోల్, రీ-పెరోల్, పెరోల్ ఇన్ ప్లేస్ లేదా డీహెచ్ఎస్ కస్టడీ నుంచి పెరోల్ వంటివి ఉంటాయి. ఈ రుసుము ఇప్పటికే ఉన్న ఏదైనా ఇతర ఇమిగ్రేషన్ సర్వీస్ ఫైలింగ్ లేదా బయోమెట్రిక్ రుసుముకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ అధికారులు సూచించిన సమయం లోపు ఈ రుసుమును చెల్లిస్తేనే పెరోల్ పొందడానికి అనుమతినిస్తారు. ఈ తరహా ఆంక్షలపై ఎన్నారైలు మండిపడుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





