కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర జులై 5 : కాకతీయ విశ్వవిద్యాలయంలో జులై 7న జరగనున్న 23 వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి తెలిపారు. శనివారం సేనేట్ హాల్లో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. రాజేందర్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో విశ్వవిద్యాలయ సెనెట్ మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ విచ్చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, ఐఐసీటీ డైరెక్టర్ డా. డీ. శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారని వీసీ వివరించారు.
ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే స్నాతకోత్సవం లో ఆర్ట్స్ ఫ్యాకల్టీ లో 60 గోల్డ్ మెడల్ లు, 56 పీహెచ్డీ లు, సైన్సు ఫ్యాకల్టీ లో 161 గోల్డ్ మెడల్ లు, 96 పీహెచ్డీలు, ఫార్మసీ ఫ్యాకల్టీ లో 48 గోల్డ్ మెడల్ లు, 21 పీహెచ్డీలు, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫాకల్టీ లో 66 గోల్డ్ మెడల్ లు, 49 పీహెచ్డీ లు, సోషల్ సైన్సెస్ ఫాకల్టీ లో 88 గోల్డ్ మెడల్ లు, 133 పీహెచ్డీలు, ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ లో 25 గోల్డ్ మెడల్ లు, 18 పీహెచ్డీలు, లా ఫాకల్టీ లో 72 గోల్డ్ మెడల్ లు, 4 పీహెచ్డీ లు, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫాకల్టీ లో 44 గోల్డ్ మెడల్ లు, 10 పీహెచ్డీలు, అందజేస్తారని వివరించారు. మొత్తం 564 గోల్డ్ మెడల్ లు, 387 పీహెచ్డీలు ప్రధానం చేస్తునట్లు సమావేశం లో వెల్లడించారు.
స్నాతకోత్సవం అక్కడమిక్ సెనేట్ సమావేశంతో ప్రారంభమవుతుందన్నారు. అనంతరం గవర్నర్, ముఖ్య అతిథి, వీసీ, రిజిస్ట్రార్, పూర్వపు ఉపకులపతులు, కంట్రోలర్, డీన్స్, పాలకమండలి. సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో తీసుకుంటారని చెప్పారు. తర్వాత సెనేట్ సభ్యుల పొసేషన్ నిర్వహించబడుతుందని, వెంటనే బంగారు పతకాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు స్నాతకోత్సవ కార్యక్రమం ముగియనుంది.
ఈ వేడుకను అన్ని విభాగాల సహకారంతో విజయవంతంగా నిర్వహించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమ నిర్వహణ కొరకు ఒక స్టీరింగ్ కమిటీతో బాటు మొత్తం 10 సబ్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కమిటీలో కన్వీనర్, కో కన్వీనర్ లతో బాటు 10 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతో కలిపి వేసిన ఈ కమిటీలు స్నాతకోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నారని వీసీ అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది సహకరించి కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిలబెట్టాలని కోరారు. విలేఖరుల సమావేశంలో రిజిస్ట్రార్ రామచంద్రం, కట్ల రాజేందర్ పాల్గొన్నారు.
రెండు రోజులు వాకింగ్ బంద్
కాకతీయ విశ్వవిద్యాలయంలో 23వ స్నాతకోత్సవం దృష్ట్యా, జూలై 6, 7వ తేదీలలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వాకర్లకు, ఇతరులకు ప్రవేశంలేదని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం ఒక అధికారిక సర్క్యలర్ జారీ చేశారు. స్నాతకోత్సవ ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలను విధిగా పాటించి సెక్యూరిటీ సిబ్బందికి సహకరించి నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.





