– అభివృద్ధిలో నిర్మాణ, డిజైనింగ్ రంగాలు కీలకం
– తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకెళుతున్నాం
– దావోస్ సదస్సులో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులు
– మీ ఆలోచనలను మాతో పంచుకోండి
– ఏస్ టెక్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటి రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: నిర్మాణ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తున్నదని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఏస్ టెక్ హైదరాబాద్ 2026 కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం హైటెక్స్ లో ప్రారంభించారు. ఏస్ టెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ సుమిత్ గాంధీ ఆధ్వర్యంలో ముదిత్ గుప్తా ప్రారంభించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్కిటెక్చర్, రియల్ ఎస్టేట్, ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్ లో ప్యానల్ సభ్యులు, పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహాన్ని వివరించడంతో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. పొల్యూషన్ ఫ్రీ సిటీ అంశంపై యువ బిల్డర్స్ అడిగిన ప్రశ్నను మంత్రి అభినందించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ సంస్థల స్టాల్స్ ను మంత్రి ప్రారంభించి కలియ తిరిగారు. ఏసీఈ-టెక్ అనేది ఒక ఎగ్జిబిషన్ మాత్రమే కాదు.. ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన కొత్త ఐడియాలు, కొత్త టెక్నాలజీలు, కొత్త అవకాశాలు అన్నీ ఒకచోట కలిసే ప్లాట్ఫామ్ అని చెప్పారు. ఆర్కిటెక్టులు, బిల్డర్లు, మాన్యుఫ్యాక్చరర్స్, ఇన్వెస్టర్లు.. అందరూ కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే చోటు ఇది అని అన్నారు. తెలంగాణ గురించి చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం చాలా వేగంగా ముందుకెళ్తోంది.. మంచి రోడ్లు, స్ట్రాంగ్ బిల్డింగ్స్, ప్లాన్డ్ సిటీస్, మోడ్రన్ కనెక్టివిటీ.. ఇవన్నీ తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యతలన్నారు. అభివృద్ధిలో కన్స్ట్రక్షన్, డిజైన్ రంగాల పాత్ర చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అనే స్పష్టమైన విజన్తో పనిచేస్తోందని, 2047 నాటికి వి3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఈ దిశలోనే గత ఏడాది భారత్ ఫ్యూచర్ సిటీలో చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఉ2025 పెద్ద సక్సెస్ అయిందని, దాదాపు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి గుర్తు చేశారు.
ఎక్కువ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నాం
తెలంగాణ విజన్-2047 గురించి మాట్లాడుతూ ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి సెక్టార్స్లో ఇంకా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రీన్ బిల్డింగ్స్, సస్టైనబుల్ కన్స్ట్రక్షన్, స్మార్ట్ మెటీరియల్స్ ఇవన్నీ భవిష్యత్తుకు చాలా ముఖ్యమన్నారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు చూస్తున్న మంత్రిగా, ఈ రంగాలను ఇంకా ముందుకు తీసుకెళ్లడమే నా ధ్యేయమన్నారు. మన లక్ష్యం కేవలం ఈరోజు వరకే కాదు.. ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మంచి లివింగ్ కండిషన్స్ ఇవ్వాలి. బెటర్ లైఫ్, మోర్ జాబ్స్, స్ట్రాంగ్ ఎకానమీ కావాలంటే ట్రాన్స్పోర్ట్ చాలా కీలకమైన విషయం.. అందుకే ప్రభుత్వం హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల పాలసీ తీసుకొచ్చిందని వివరించారు. ఈ ఏసీఈ-టెక్ ఎడిషన్లో 300కి పైగా ఇండియన్ & ఇంటర్నేషనల్ బ్రాండ్లు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ గ్రోత్లో భాగం కావాలనుకునే వాళ్లతో ప్రభుత్వం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే గ్రీన్, స్మార్ట్, బెటర్ సిటీస్ని కలిసి నిర్మిద్దాం.. ఇన్నోవేషన్, క్వాలిటీ డెవలప్మెంట్కు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిర్మాణరంగ ప్రముఖులు ఎస్పీ రెడ్డి, దామోదరన్, ఫైసల్ వోహ్రా, రూపాన రెడ్డి,స్నేహిత్ రెడ్డి మేడ, సుప్రజారావు, వీర్ ప్రకాశ్ యాదవ్, పార్థ కర్మాకర్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎన్ ఏసీ డీజీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





