– కెసిఆర్ కుటుంబం ఎందరి జీవితాలనో నాశనం చేసింది
– కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు
కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 23: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియల్లా కొనసాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉందన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. కేటీఆర్ సిరిసిల్ల కేంద్రంగా అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేయించారు. ఆయన చేసిన దారుణాలతో కొన్ని కుటుంబాలు మునిగాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి అరెస్ట్లు జరగవు. కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని తేలిపోయిందన్నారు. దేశ భద్రత కోసం జరిగే ట్యాపింగ్కు తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధమే లేదు. మావోయిస్టుల పేరుతో హీరోయిన్లు, వ్యాపారులు, రాజకీయ నేతలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు. సిట్లో మంచి అధికారులు ఉన్నారు.. కానీ ప్రభుత్వం వారికి స్వేచ్ఛను ఇవ్వడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టేవాళ్లమన్నారు. తప్పు చేసిన నేతలు, అధికారులను అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చాలామంది పారాశ్రామికవేత్తలను బెదిరించి కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. సినిమా హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి లాభపడ్డారని ఆరోపించారు. స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిందని సీఎం, పలువురు మంత్రులే చెప్పారన్నారు. జడ్జిల ఫోన్లు, ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని సంజయ్ అన్నారు.
ఎలక్టోర్ బాండ్ల పేరుతో బీఆర్ఎస్ కోట్లు వసూలు చేసిందన్నారు. ఎంతమంది ఆస్తులను జప్తు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావును కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఇంత హడావుడి చేస్తున్న సిట్ ఏం సాధించిందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఒక్క రాజకీయ నేతను అరెస్ట్ చేయలేదన్నారు. కాంగ్రెస్ కొండను తవ్వి ఎలుకను పట్టుకోలేకపోతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. విచారణ పేరుతో ప్రభుత్వం టైం పాస్ చేస్తున్నదన్నారు. స్వయంగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిందన్నారు. కేసీఆర్ భయానికి యాచకులు కూడా వాట్సప్ కాల్స్ మాట్లాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ పై కంప్లైంట్ చేశానని బండి సంజయ్. తెలిపారు. అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేయడానికి హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఏఐసీసీ ఆఫీస్ కు, ఫాంహౌస్ కు డీల్ కుదరడం లేదని, అందుకే కేసును సాగదీస్తున్నారని చెప్పారు. అన్ని ఆధారాలుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకుంటేనే ప్రజలకు నమ్మకం కల్గుతుందని బండి సంజయ్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





