- ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం
- ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి మృతి
- గాజర్ల రవిపై రూ.25 లక్షల రివార్డు
- రవితోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు హతం
- మృతదేహం స్వాధీనం కోసం తరలిన బంధువులు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 18 : నిషేధిత మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందగా, ఆయన మరణాన్ని జీర్ణించుకోకముందే మరో భారీ ఎదురుదెబ్బ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ రూపంలో తగిలిందనే చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పీపుల్స్ వార్ పార్టీతో జరిపిన చర్చలలో ప్రస్తుత
మావోయిస్టు పార్టీ ఏఓబి ప్రత్యేక కార్యదర్శి గాజర్ల రవి శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. రవి మరణంతో 33 ఏళ్ల అజ్ఞాత ప్రస్థానం ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతి చెందాడు. ఆయనతోపాటు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గాజర్ల రవి పై ప్రభుత్వం 25 లక్షల రివార్డును ప్రకటించింది.
ఒకే ఇంటి నుంచి ముగ్గురు అజ్ఞాతంలోకి…
33 ఏళ్ల క్రితం జయశంకర్ భూపాలపల్లి టేకుమట్ల మండలం వెలిశాల పల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నాటి పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమంలో చేరారు. మొదటగా గాజర్ల రవి అన్న సారయ్య, అలియాస్ ఆజాద్ తో కలిసి పార్టీలో చేరిగా, అన్నల బాటలోనే తన చిన్న తమ్ముడు అశోక్ సైతం మావోయిస్టు పార్టీలో చేరారు. అన్న ఆజాద్ ఎన్కౌంటర్ లో మృతి చెందగా, తమ్ముడు అశోక్ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాజర్ల రవి భార్య జిలానీబేగం సైతం ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సమాచారం. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో గాజర్ల రవి మృతి చెందాడని తెలియడంతో వెలిశాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వెంకటరవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ అలియాస్ రూపీ
వెంకట రవి లక్ష్మి చైతన్య, అలియాస్ అరుణ… అలియాస్ రూపీ.(54) కరక వాణి పాలెం పెందుర్తి మండలం విశాఖ జిల్లాకు చెందినవారు. ఆమెపై రూ.20 లక్షల రివార్డ్ ఉంది. స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్. ఏవోబీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఈమె తమ్ముడు అజాత్ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి చెందారు. ఈమె తల్లి మావి నేత గతంలో మృతి చెందారు. మావోయిస్టు పార్టీ సీసీ మెంబర్ చలపతి ఈమె భర్త, చంద్రబాబు పై అలిపిరి వద్ద జరిగిన దాడి ఘటనలో కీలక వ్యక్తి, కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం దగ్గరలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.అరుణ పై విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వర రావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్య కేసులున్నాయి. మృతుల్లో మరొకరు ఛత్తీస్గఢ్కు చెందిన అంజు ఉన్నట్లు గుర్తించారు.
గాజర్ల రవిపై ఎన్ఐఏ ఫోకస్..
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవిపై కేంద్రం దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏ ఫోకస్ పెట్టిందని సమాచారం. గాజర్ల రవి మావోయిస్టు కీలక వ్యక్తి అని, అతడిని పట్టిస్తే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ఒడిశాలో పోస్టర్లు ఏర్పాటు చేసింది. రవితో పాటు మరో ముగ్గురు మావోయిస్టులపై కూడా ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది.
1992లో ఉద్యమంలోకి….
1992లో నక్సల్స్ ఉద్యమంలో చేరిన రవి అలియాస్ గణేష్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థానానికి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004, అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరఫున ప్రతినిధిగా తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ పాల్గొన్నారు. ఆ శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో రవి కీలక పాత్ర పోషించారు. 23 ఏళ్ల నవ యవ్వనంలోనే సాయుధ బాట పట్టిన రవిపై భారీ రివార్డు ప్రకటించింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.25 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటన జారీ చేసింది. 1996 లో గాజర్ల రవి కుటుంబ సభ్యులతోపాటు బంధువుల ఇండ్లను సైతం పోలీసులు ధ్వంసం చేసి పూర్తిగా కూల్చివేసినట్లు సమాచారం. ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిన గాజర్ల అశోక్ ఎన్కౌంటర్లో మృతి చెందిన గాజర్ల ఆజాద్ కుమార్ ఇంట్లో కలిసి వెలిశాలలో నూతన గృహాన్ని నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. గాజర్ల రవి ఆచూకీ కోసం ఒడిశాలో ఎన్ఐఏ పోస్టర్లు ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జాలమూరి శ్రీను, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరు జోగా అలియాస్ టెక్ శంకర్లపై కూడా రూ.5 లక్షలు, మల్కన్గిరికి చెందిన చంటిపై రూ.2 లక్షల రివార్డులు ప్రకటించింది. ఈ నలుగురిలో ఇద్దరు ఏపీ-ఒడిశా సరిహద్దులో ప్రత్యేక జోనల్ కమిటీలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. గాజర్ల రవి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సరిహద్దుల్లోని ఏవోబీఎస్జడ్సీ ట్రై జంక్షన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో గాజర్ల రవికి మంచి పట్టు ఉందని ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం. రవిని పట్టుకునేందుకు ఎప్పటి నుంచో యత్నాలు చేస్తుండగా.. అతడి ఆచూకీ ఏమాత్రం చిక్కలేదు.
పార్టీలో ప్రస్థానం..
గాజర్ల రవి పార్టీ సభ్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గణేష్ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవారు. పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన సుదీర్ఘ కాలం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పని చేశారు. 1994లొ మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో లెంకలగడ్డ వద్ద మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో పంజాబ్ కమెండోల కమాండెంట్ జీఏ సాహితో పాటు మరో ఏడుగురు కమెండోలు మరణించారు. పంజాబ్ లో టెర్రరిస్టులను అంతమొందించడంలో పాత్ర పోషించిన సాహి లెంకలగడ్డ ఎన్ కౌంటర్ లో మరణించడం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.
మహదేవపూర్ క్యాంపులోని పంజాబ్ కమెండోల్లో ధైర్యం నింపడంతో పాటు లెంకలగడ్డ వద్ద పేల్చిన మందుపాతర ఘటన కూడా జరిగింది. ఈ ఘటనకు కర్త, క్రియ, కర్త అంతా కూడా గణేష్ గా పోలీసులు ఆయనను టార్గెట్ చేసుకున్నప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఎదురు కాల్పుల్లో గణేష్ బలగాల కళ్లుగప్పి తప్పించుకున్న సందర్బాలు ఎన్నో. ప్రముఖులను టార్గెట్ చేసి మందుపాతరలను పేల్చే విషయంలో పీపుల్స్ వార్ లో ప్రముఖంగా వినిపించిన పేర్లలో గణేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మహదేవపూర్, మహాముత్తారం, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో రిక్రూట్ కూడా గణేష్ కారణంగా పెద్ద ఎత్తున జరిగింది.
పత్తి సాగు చేసి దివాలా తీసిన రైతాంగానికి పార్టీ బాసటగా నిలవాలన్న ప్రతిపాదన కూడా గణేష్ అందించినట్లు సమాచారం. ఈ మేరకు అప్పుడు కొంతమంది రైతులకు ఆర్థిక సహాయం కూడా అందించింది. ఉత్తర తెలంగాణలో పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన గణేష్ నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలో అత్యంత ముఖ్య భూమికను అందించారు వారిలో గణేష్ పాత్ర కూడా కీలకంగా ఉంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ (కెకెడబ్ల్యూ) కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఏఓబికి వెల్లిపోయారు. స్థానిక దండకారణ్య ప్రాంతంలో కూడా వివిధ స్థాయిల్లో మావోయిస్టు పార్టీ నిర్మాణం కోసం కృషి చేశారు. ముఖ్యంగా మహదేవపూర్, ఏటూరునాగారం ప్రాంతంలో పాఠశాల పట్టున్న సమయంలో ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించినప్పుడు సేఫ్ జోన్ గా పొరుగునే ఉన్న ఛత్తీస్ గడ్ బస్తర్ అడవులను వినియోగించుకునే వారు. ఈ క్రమంలో కావాలనే అక్కడి ఆదివాసీలతో పీపుల్స్ వార్ పార్టీ మమేకమైంది. దండకారణ్య ప్రాంతంలో పార్టీ నిర్మాణంలోనూ గణేష్ భాగస్వామ్యం కీలకంగా ఉంది. 2004లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యుల బాధ్యతలు నిర్వర్తించారు.
మల్కాన్ గిరి ఘటనకు బాధ్యుడు…
2012లో ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి చెందారు. ఈ కాల్పుల్లో గాజర్ల రవిని ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ కేసును మల్కాన్గిరి పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసు ఎన్ఐఏకు చేరింది. దీంతో ఎన్ఐఏ గాజర్ల రవిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే గాజర్ల రవి ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించిందనీ సమాచారం.
మృతదేహం గుర్తింపు కోసం తరలిన కుటుంబ సభ్యులు…
గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అల్లూరు జిల్లాకు బుధవారం మధ్యాహ్నం తరలివెళ్లారు సోదరుడి మృతదేహాన్ని గుర్తించేందుకు రవి సోదరుడు గాజర్ల అశోక్ తోపాటు ఆజాద్ కుమారుడు నవీన్ తో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కు తరలివెళ్లారు.
గాజర్ల రవి మరణంపై గ్రామస్తుల అనుమానం..!
మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న గాజర్ల రవి ఎన్కౌంటర్ లో అంత సులభంగా మృతి చెందడని గ్రామస్తులు చెబుతున్నారు. రవి మృతిపై ఇప్పటికీ వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వార్తలు అనేకం ప్రచారం చేశారని, ఇది కూడా అలాంటిదే అయి ఉంటుందని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. అత్యంత భద్రత మధ్య అజ్ఞాతంలో విధులు నిర్వహించే రవి అంత సులభంగా పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందే అవకాశాలు లేవని గ్రామస్తులు అంటున్నారు.






