టేకాఫ్‌ అయిన క్ష‌ణాల్లోనే కుప్పకూలిన విమానం

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
242 మంది ప్ర‌యాణికుల దుర్మరణం?
మృతుల్లో మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ..
ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి అమిత్‌ ‌షా

గాంధీనగర్‌, జూన్ 12: అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171  ర‌న్‌వే 23 నుంచి గురువారం మధ్యాహ్నం  1.39 గంట‌ల‌కు టేకాఫ్ అయిన వెంట‌నే ప్ర‌మాదానికి గురైంది. ఆ స‌మ‌యంలో పైలెట్ల‌నుంచి మేడే కాల్ (డిస్ట్రెస్ కాల్‌) వ‌చ్చిన‌ట్టు పౌర విమాన‌యాన‌శాఖ వ‌ర్గాలు తెలిపాయి. త‌క్ష‌ణం ఏటీసీ స్పందించినా అవ‌త‌ల‌వైపు నుంచి స్పంద‌న రాలేద‌ని, విమానం కూలిపోయి ద‌ట్ట‌మైన పొగలు వ్యాపించాయ‌ని చెబుతున్నారు. ఇందులో దాదాపు 242మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో గుజ‌రాత్ మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మేఘానిలో ఎయిర్ ఇం‌డియా విమానం టేకాఫ్‌ అయిన వెంటనే విమానం సివిల్‌ ‌హాస్పిటల్‌కు స‌మీపంలోని చెట్టును ఢీకొట్టిన అనంతరం జనావాసాలపై కూలిపోయింది. విమాన ప్ర‌మాదాన్ని ఎయిర్‌ ఇం‌డియా కూడా ఎక్స్ ‌వేదికగా ధ్రువీకరించింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌, ఏడుగురు పోర్చుగీస్ , ఒక కెనడా వాసి ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో గుజరాత్‌ ‌మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ కూడా ఉన్నారు. అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలించారు. బిఎస్‌ఎఫ్‌ ‌సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సంఘ‌ట‌న స‌మాచారం అందిన వెంట‌నే కేంద్ర మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు గుజరాత్‌ ‌కు బయల్దేరారు. ప్రమాదంపై గుజరాత్‌ ‌సిఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా ఫోన్‌ ‌చేసి ఆరా తీశారు. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన క్ష‌ణాల్లోనే మేఘాని నగర్‌ ‌ఘోడాసర్‌ ‌క్యాంప్‌ ‌ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఫ్లైట్‌ ‌రాడార్‌ 24 ‌ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ ‌కోల్పోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టును ఢీకొన్నట్లు ప్రాథమిక అంచ‌నా. ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్‌ 787 ‌డ్రీమ్‌ ‌లైనర్‌. ‌దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌సివిల్‌ ఏవియేషన్‌ (‌డీజీసీఏ) స్పందించింది. విమానానికి కెప్టెన్‌గా సుమిత్‌ ‌సబర్వాల్‌, ‌ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్‌ ‌కుండర్‌ ‌వ్యవహరించినట్లు పేర్కొంది. సుమిత్‌కు ఎల్‌టీసీగా 8,200 గంటలు, కోపైలట్‌కు 1,100 గంటల అనుభవం ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్‌లైన్‌ ‌నెంబర్‌ 1800 5691 444 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమ సామాజిక మాధ్యమం, ఎయిర్ ఇం‌డియా వెబ్‌సైట్‌లో కూడా ప్రమాద వివరాలు, అప్‌డేట్లు ఉంటాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపేశారు. అహ్మ‌దాబాద్ ప్ర‌మాదాన్ని ఒక విషాద సంఘ‌ట‌న‌గా భార‌త విదేశాంగ‌శాఖ పేర్కొంది. అయితే విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీన్ జైస్వాల్ మృతుల సంఖ్య‌పై స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నందున మృతుల వివ‌రాలు తెలిసేస‌రికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

‌విమాన ప్ర‌మాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదంపై ఆరా తీశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ ‌చేయాలని కేంద్ర మంత్రిని ఆదేశించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షాతోనూ ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్‌ ‌వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని రామ్మోహన్‌ ‌నాయుడు, అమిత్‌ ‌షాకు ప్రధాని సూచించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్లు పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. అటు ఎయిర్‌‌క్రాప్ట్ ‌యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌బ్యూరో (ఏఏఐబీ) రంగంలోకి దిగింది. ఏఏఐబీ డీజీ, ఇతర అధికారులు ఘటనాస్థలానికి బయల్దేరారు.

క‌ల‌చివేసిన సంఘ‌ట‌న‌: రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

విమాన ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై రాష్ట్రప‌తి ద్రైప‌ది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తీవ్రంగా క‌ల‌చివేసింద‌న్నారు. బాధితుల‌కు దేశం అండ‌గా నిలుస్తుంద‌న్నారు

సిఎం రేవంత్‌ ‌రెడ్డి విచారం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌12: అహ్మదాబాద్‌ ‌లో జరిగిన ఎయిర్‌ ఇం‌డియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కూతురు కోసం లండన్‌ ‌బయల్దేరి..
– విజ‌య్ రూపానీ దుర్మ‌ర‌ణం

గాంధీనగర్‌, జూన్ 12: అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి లండన్‌ ‌బయలుదేరిన ఎయిర్‌ ఇం‌డియా విమాన ప్రమాదంలో గుజరాత్‌ ‌మాజీ సీఎం విజయ్‌ ‌రూపాని సైతం మరణించారు. మరోవైపు 50 మృతదేహాలను విమాన శకలాల నుంచి వెలికి తీశారు. విజయ్‌ ‌రూపానీ కుమార్తె లండన్‌లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యలో ఆమె వద్దకు వెళ్లేందుకు లండన్‌ ‌ప్రయాణమయ్యారు. ఇక ఆయన భార్య అంజలి రూపానీ లండన్‌లోనే ఉన్నారు. ఆమెను తీసుకు వచ్చేందుకు లండన్‌ ‌పయనమైనట్లు-కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్‌ ‌తొలుత నెట్టింట వైరల్‌గా మారింది. అందులో బోర్డింగ్‌ ‌సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆయన విమానం ఎక్కినట్లు నిరా్ధ‌రించే ప్యాసింజర్‌ ‌జాబితాలోనూ రూపానీ పేరు ఉంది. లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్‌ ‌రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్‌ ‌చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. భాజపాకు చెందిన విజయ్‌ ‌రామ్‌నిక్‌ ‌లాల్‌భాయ్‌ ‌రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండుసార్లు గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా చిన్న కుమారుడు పూజిత్‌ ఓ ‌ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *