– మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోవాలి
– మాజీ మావోయిస్ట్ జంపన్న కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మావోయిస్ట్ నేత హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న ఆరోపించారు. ఎన్కౌంటర్ తీరు పూర్తిగా పట్టుకుని కాల్చినట్లుగానే ఉందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అడవుల్లో ఉండి ప్రాణాలు కోల్పోకండని జంపన్న హితవు పలికారు. పోలీసుల ముందు లొంగిపోవడం అవమానకరం ఏమీ కాదు.. ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేయొచ్చని, ప్రాణాలతో ఉండడం చాలా ముఖ్యం అని అన్నారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో తాను 17 ఏళ్ళపాటు పనిచేశానని, పార్టీ ఇప్పుడు పూర్తిగా క్షీణించిందని ఆయన అన్నారు. భద్రతాదళాలకు ఇన్ఫార్మర్ వ్యవస్థ గతం కంటే భారీగా పెరిగిందని, మరో వైపు మావోయిస్టులకంటే పోలీసులకు టెక్నాలజీ, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ’హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారు.. ఎదురు కాల్పులు జరిగినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవు. ఏదైనా టార్గెట్లో యాక్షన్ చేయాలి అంటే ఐదు మందికి మించి ఉండరు. పదుల సంఖ్యలో యాక్షన్ అనేది పార్టీ అనుమతించదు. ఈ ఎపిసోడ్లో మధ్యవర్తిత్వం చేసిన వారు మోసం చేసినట్లు కనిపిస్తోందని జంపన్న వ్యాఖ్యానించారు. పార్టీలో హిడ్మాకు మంచి గుర్తింపు ఉంది. యాక్షన్ చేయడంలో దిట్ట. హిడ్మా యాక్షన్లో ఉన్నాడు అంటే సక్సెస్ చేసుకొనే వస్తాడు అనే నమ్మకం పార్టీలో ఉంది. యాక్షన్ చేయాలి అంటే ఒక వ్యక్తి నిర్ణయం ఉండదు. పార్టీ నాయకత్వం నిర్ణయం ప్రకారమే ఉంటుంది. హిడ్మా తరువాత మావోయిస్టు పార్టీ కనుమరుగైందనేది నమ్మను. దేవ్ జీ, గణపతి, పల్లా రాజిరెడ్డి, గణెళిష్, సాగర్, జనార్దన్తోపాటు ఇంకా కేంద్ర కమిటీలో ఉన్నారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, బీహార్, మధ్య ప్రదేశ్లో ఇంకా మావోయిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారు అని జంపన్న చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





