– సీఈవో సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్లు, వేచి ఉండే స్థలాలు, లైటింగ్, ర్యాంపులు, స్పష్టమైన సైన్బోర్డులు అందుబాటులో ఉంటాయని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సుగమమైన ఓటింగ్ అనుభవాన్ని నిర్ధారించేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్లో వీటి ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటిసారిగా పోలింగ్ స్టేషన్ల బయట మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నామని, ఓటర్లు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఈ కౌంటర్లలో ఉంచి ఓటు వేసిన తర్వాత తిరిగి తీసుకెళ్లవచ్చునని చెప్పారు. వృద్ధులు, వికలాంగులు సహా అందరికీ ఓటింగ్ సులభంగా, అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ రోజుకు ముందే ప్రతి బూత్ సిద్ధంగా ఉంటుందని, తద్వారా ఓటర్లు సౌకర్యవంతంగా, ఆలస్యం లేకుండా ఓటు వేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఓటు రహస్యాన్ని కాపాడేందుకు ప్రామాణిక ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఉపయోగిస్తామన్నారు. ఓటరు సమాచార పోస్టర్లలో పోలింగ్ వివరాలు, అభ్యర్థుల జాబితా, గుర్తింపు కార్డు అవసరాలు, ఓటింగ్ సూచనలు ప్రదర్శిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్థలంలో ఓటరు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇవి బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తారని, ఓటర్లు తమ పేరు, బూత్ నంబర్ను ఓటరు జాబితాలో కనుగొనేందుకు ఇవి సహాయపడతాయని తెలిపారు. రాష్ట్రంలోని పోలింగ్ స్టేషన్లను ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాల్లో ఇవి భాగమని సీఈవో తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



