– కడుపులో కత్తులు పెట్టుకున్నవారితో కొట్లాడలేం
– కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యలపై ఈటల స్పందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: హుజురాబాద్ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని తన వద్దకు వచ్చిన కార్యకర్తలనుద్దేశించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇకనుంచి అక్కడ స్ట్రెయిట్ ఫైట్ ఉంటుందని.. స్ట్రీట్ ఫైట్ మాత్రం కాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హుజురాబాద్లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శామీర్పేట్లోని ఈటల రాజేందర్ ఇంటికి కార్యకర్తలు శనివారం భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రావడానికి అనేక కారణాలున్నాయన్నారు. పదవుల కోసం పార్టీ మారలేదన్నారు. హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారంటూ తానూ వారిని అలాగే కాపాడుకుంటానని మాట ఇచ్చారు. నేను అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేశానన్నారు. తన నియోజకవర్గానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేరుగా వచ్చి సమావేశం పెట్టారని గుర్తుచేశారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు. బీజేపీలో అన్నిరకాల అంశాలని పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని, తనకు తెలియని వారు లేరని, బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు పొందానని గుర్తుచేశారు. దేశ ప్రధాని మోదీ వ్యక్తుల కోసం కాకుండా వ్యవస్థ నిర్మాణం కోసం పని చేస్తున్నారని నొక్కిచెప్పారు. మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కొంతమంది ఉంటారని, వారు ఇతరులను ఎదగనివ్వకుండా చేయడమే వాళ్ల పని అని విమర్శించారు ఎంపీ ఈటల విమర్శించారు.



