క్షేత్రస్థాయిలో ప్రతీ ఇంజనీర్‌ అప్రమత్తంగా ఉండాలి

– వరద ప్రవాహం ఉన్న రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
– కోతకు గురైన రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేయాలి
– ఆర్‌అండ్‌బిని అప్రమత్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: అధిక వర్షాల నేపథ్యంలో ఆర్‌అండ్‌బి అధికారులను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంజనీర్‌ అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బతుకమ్మ, దసరా పండగనేపథ్యంలో వాహనాల రాకపోకలు పెరిగాయని,సెలవుల్లో విద్యార్థులు ఇళ్లకు చేరుకున్నందున సరదా కోసం రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకునే కొంతమంది యువత పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులతో అన్నారు. అధిక వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో కల్వర్టులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో వాహనాలను దారి మళ్లించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో ప్రజా రవాణాను అనుమతించొద్దని స్పష్టం చేశారు. వరద ప్రవాహం ఉన్న రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, కోతకు గురైన రోడ్లను ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా వెంటనే తాత్కాలికంగా పునరుద్ధరణ చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా విద్యుత్‌, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలన్న మంత్రి, పోలీస్‌ యంత్రాంగం సమన్వయంతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులకు ప్రత్యేకంగా సూచించారు, నార్కట్‌పల్లి- అద్దంకి(‘నావమ్‌’ª రహదారి పనుల పురోగతిపై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నందిపహాడ్‌ ఎక్స్‌ రోడ్‌ వెహికిల్‌ అండర్‌ పాస్‌ నిర్మాణంపై ఆర్‌ అండ్‌ బి చీఫ్‌ ఇంజనీర్‌ రాజేశ్వర్‌ రెడ్డితో చర్చించారు. యాక్సిడెంట్‌ స్పాట్స్‌ లేని రోడ్డుగా నిర్మిస్తున్నామని, నందిపహాడ్‌ ఎక్స్‌ రోడ్‌ వెహికిల్‌ అండర్‌ పాస్‌ నిర్మాణాన్ని వేగం చేయాలని అన్నారు. పనులకు ఇబ్బందిగా ఉన్న అక్కడి విద్యుత్‌ స్తంభాల తొలగింపు, మిషన్‌ భగీరథ పైపులైన్‌ మార్పు వంటివాటిపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సి.ఈ. రాజేశ్వర్‌ రెడ్డి, ఇతర ఆర్‌ అండ్‌ బి అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ‘నామ్‌’ ప్రాజెక్ట్‌ ఎక్జిక్యూటివ్‌ చైర్మన్‌ హరికిషన్‌ రెడ్డి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సిహెచ్‌.భగవాన్‌ రాజ్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ హెడ్‌ టి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *