వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరూఖ్నగర్ మండలాల్లోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32 వేల ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. మంచాల మండలం బోడకొండలో ఎమ్మెల్యే మల్రెడ్డి, తలకొండపల్లి మండలం చీపునూతలలో కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవెల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చేనాటికి ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12వేలు మాత్రమే ఉందని, తమ ప్రభుత్వ కృషి వల్ల ఇప్పుడు వాటి ధర రూ.18748గా ఉందని చెప్పారు. రైతులు సాంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంట అయిన ఆయిల్ పామ్ సాగు వైపు చూడాలని, ఒకసారి ఆయిల్పామ్ సాగు చేస్తే 30 సంవత్సరాల వరకు ఆదాయం వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ ఆయిల్పామ్ పంటలకు డ్రిప్ పరికరాలు సబ్సిడీపౖిె అందచేయాలని, ఎంఐడీహెచ్ పథకం కింద ప్యాక్ హౌస్కు సబ్సిడీ అందజేయాలని, సబ్సిడీపౖిె డ్రోన్లను ఇవ్వాలని కోరారు. గుడిమల్కాపూర్ పూల, కూరగాయల మార్కెట్ను అజిజ్నగర్కు మార్చాలని కోరారు. దీనికి మంత్రి తుమ్మల స్పందిస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తానికి ఎలాంటి షరతులు లేకుండా డ్రిప్ పరికరాలను సబ్సిడీపౖిె అందచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యానవన పంటలకు, పామ్ ఆయిల్ పంటలో వేసే అంతర పంటలకు కూడా సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇస్తామని అన్నారు. పాలు, కూరగాయల కోసం రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఉండేందుకు మన రాష్ట్రంలోనే కూరగాయల సాగు, డెయిరీలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు కూడా సాంప్రదాయ పంటలనే కాకుండా ఉద్యానవన పంటలు, కూరగాయలు, డెయిరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో వచ్చే నెలాఖరు వరకు 5 వేల ఎకరాలలో ఆయిల్పామ్ ప్లాంటేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు పాల్గొన్నారు
పామాయిల్ సాగుకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు





