– పార్ములా రేస్ వివరాలన్నీ ప్రభుత్వశాఖలవద్దే వున్నాయి
– ఫోన్ తప్ప మరే ఇతర ఉపకరణం వాడలేదు
– ఫోన్ అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే
– ఏసీబీ నోటీసుపై కె.టి.ఆర్. స్పందన
– ఫోన్ తప్ప మరే ఇతర ఉపకరణం వాడలేదు
– ఫోన్ అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే
– ఏసీబీ నోటీసుపై కె.టి.ఆర్. స్పందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ నెల 16న ఏసీబీ ఇచ్చిన నోటీసుపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లేఖ ద్వారా ఏసీబీ కి సమాధానం పంపించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 13న మీరు పంపిన లేఖ మేరకు 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరయ్యానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు సాగిన విచారణకు అన్ని రకాలుగా పూర్తి సహకారం అందించిన విషయాన్ని ప్రస్తావించారు. ఫార్ములా వన్ రేసు కేసులో ఈ నెల 16న విచారణ పూర్తయిన తరువాత బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 94 ప్రకారం తనకు మరో నోటీసును అందించారని, అందులో తాను నవంబర్ 1, 2021 నుంచి డిసెంబర్ 1,2023 వరకు వాడిన మొబైల్ ఫోన్ ను, ల్యాప్ ట్యాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను ఏసీబీకి సమర్పించాలని నోటీసులో కోరినట్టు కేటీఆర్ తెలిపారు. అయితే బీఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 94 కింద ఇచ్చిన నోటీసులో తాను నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2023 మధ్య కాలంలో వాడిన సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎందుకు సమర్పించాలన్న కారణం కానీ, ఉద్దేశం కానీ వివరించలేదని పేర్కొన్నారు. ఫార్ములా కేసు విచారణకు సంబంధించి అవసరమైన అన్నిరకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక శాఖ వద్దే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. అవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలని చెప్పారు. ఫిర్యాదులో తనపై చేసిన ఆరోపణల్లో గతంలో వాడిన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రస్తావన కానీ, సంబంధం కానీ లేనప్పటికీ వాటిని సమర్పించాలని కోరడమంటే రాజ్యాంగం ఒక పౌరుడిగా తనకు కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేశారు. కేసు విచారణ కోసం తాను వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులు అవసరమనే ప్రాతిపదికను ఎక్కడా కూడా ప్రస్తావించలేదన్న సంగతిని గుర్తుచేశారు. విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించాల్సి వస్తే సుప్రీంకోర్టు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో సేకరించే ఎలక్ట్రానిక్ వస్తువులను విచారణ సంస్థల అధికారులు ట్యాంపర్ చేయకుండా ఉండేందుకు కఠిన నిబంధనలను పాటించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.వ్యక్తిగత గోప్యతతోపాటు, విచారణ పేరుతో ఒక పౌరుడి నుంచి ఎందుకు తీసుకుంటున్నారనేదానికి సరైన కారణం చెప్పకుండా, సేకరించిన సమాచారాన్ని ఆయనకే వ్యతిరేకంగా వాడడం సరైనది కాదనడానికి ‘రైట్ అగెనెస్ట్ సెల్ఫ్-ఇంక్రిమినేషన్స అనేవి అత్యంత ముఖ్యమైనవని, వాటికి భంగం కలగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు సూచించిందని పేర్కొన్నారు. ఇదే అంశంలో రిట్ పిటిషన్ దాఖలు చేసిన పిటీషనర్ కి సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఆ కేసులో రెస్పాండెంట్ గా ఉన్న ఈడీకి, పౌరుడి మొబైల్ ఫోన్ ను వాడటంకానీ, అందులోని సమాచారాన్ని కాపీ చేయవద్దని కూడా స్పష్టంచేసిందని కేటీఆర్ వెల్లడించారు. వివిధ దర్యాప్తు సంస్థలు విచారణలో భాగం చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల కేసులు అనేకం కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. 2024 మొదటి త్రైమాసికంలో తాను మొబైల్ ఫోన్ మార్చానని, తాను గతంలో వాడిన ఆ పాత ఫోన్ ఇప్పుడు తన దగ్గర లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తాను ఫోన్ కాకుండా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడలేదని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.





