– సివిల్ తగాదాల్లో తలదూరిస్తే కఠిన చర్యలు
– రాష్ట్ర పోలీస్ సిబ్బందికి డిజిపి హెచ్చరిక
న్యూదిల్లీ, అక్టోబర్ 13: పోలీసులు లంచగొండులుగా మారినా, సివిల్ తగాదాల్లో తలదూర్చినా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు లేదని స్పష్టం చేశారు. సివిల్ వివాదాల కోసం సివిల్ కోర్టులు ఉన్నాయని వివరించారు. పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు రాష్ట్ర పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలని ఆయన ప్రస్తావించారు. యూనిఫాం, అవినీతి ఒకే దగ్గర ఉండవని తేల్చిచెప్పారు. ఒక్క పోలీస్ అధికారి అయినా లంచం తీసుకుంటే డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వొస్తుందన్నారు. ప్రజల భద్రత పోలీసు ప్రధాన బాధ్యత అని ఉద్ఘాటించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం తన వ్యక్తిగత ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ తన ఫిలాసఫీ అని డీజీపీ నొక్కిచెప్పారు. కేసుల విషయంలో బేసిక్ పోలీసింగ్తోపాటు టెక్నాలజీని వాడాలని సూచించారు. పేద ప్రజలు ఆపదలో ఉంటే పోలీసులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఆపదలో ఆదుకున్న వాళ్లని పేదలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.



