– అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజలు
– నితీశ్ కుమార్ను భారంగా భావిస్తున్న బిజెపి
– ఎన్డిఏలో తారస్థాయికి అంతర్గత కలహాలు
– కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
పాట్నా,సెప్టెంబర్24: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బిహార్ ప్రజలు బీజేపీ రెలిజియస్ పోలరైజేషన్పై ఏమాత్రం ఆసక్తిగా లేరని, అభివృద్ధి, సంక్షేమంతో కూడిన రాజకీయాలను కోరుకుంటున్నారని చెప్పారు. బిహార్లోని ఎన్డీయేలో అంతర్గత కలహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నా యని, ముఖ్యమంత్రి నితీష్కుమార్ను ఒక భారంగా బీజేపీ భావిస్తోందని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, వోట్ చోరీ అంశంపై బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టే విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం బిహార్ రాజధాని పాట్నాలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సదాకత్ ఆశ్రమంలో బుధవారంనాడు నిర్వహించారు. ఖర్గే అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేత రాహుల్ గాంధీ, కోశాధికారి అజయ్ మాకెన్, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, పార్టీ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరయ్యారు. జాతీయంగా, అంతర్జాతీయంగా దేశం పెక్కు సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోందని ఖర్గే ఈ సందర్భంగా అన్నారు. మోదీ, ఆయన ప్రభుత్వ దౌత్య వైఫల్యాల కారణంగానే అంతర్జాతీయంగా మనం సమస్యలను ఎదుర్కొంటున్నామని విమర్శించారు. మోదీ నా ఫ్రెండ్ అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఇప్పుడు ఇండియాను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వోటు చోరీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత, పారదర్శకతపై ఆందోళనలు తలెత్తుతున్నాయని ఖర్గే అన్నారు. వివిధ రాష్ట్రాల్లో అవకతవకలను రాహుల్ లేవనెత్తుతుంటే వాటిని పరిష్కరించకుండా అఫిడవిట్లు సమర్పించాలని ఈసీ ఒత్తిడి తెస్తోందన్నారు. బిహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది వోటర్లను తొలగించేందుకు ప్రస్తుతం కుట్ర జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. వోట్ చోరీ అంటే రేషన్, పెన్షన్, మెడిసన్, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల హక్కులను దొంగిలించడమేనని అన్నారు. ప్రజలు బహిరంగంగానే మోదీ తీరును ఎండగడుతున్నారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





