న్యూదిల్లీ,అక్టోబర్10: దగ్గు సిరప్ మరణాలపై జ్యుడీషియల్ కమిషన్ లేదా నిపుణుల కమిటీతో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. న్యాయవాది, పిటిషనర్ విశాల్ తివారీ తన కెరీర్లో ఎన్నిసార్లు పిల్లు దాఖలు చేశారని ప్రశ్నించింది. ప్రస్తుతం నిషేధించబడిన కోల్డ్రి సిరప్ తయారీ సంస్థ ఉన్న మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు పరస్పరం నిందించుకుంటూ, విమర్శలకు దిగుతున్నాయని, వాటి దర్యాప్తులో ఎటువంటి గణనీయమైన చర్యలు తీసుకోకుండానే సమయం వృధా అవుతోందని తివారీ అన్నారు. తివారీ కేంద్రీకృత దర్యాప్తును కోరారు. ఎఫ్ఐఆర్లను సిబిఐకి బదిలీ చేయాలని న్యాయవాది పిటిషన్లో కోరారు. పరిశ్రమల్లో వినియోగించే విషపూరిత రసాయనమైన డైఇథిలిన్ గ్లైకాల్ కలిగిన కలుషితమైన దగ్గు సిరప్ల తయారీ, నియంత్రణ, పరీక్ష మరియు పంపిణీపై సమగ్ర విచారణ జరపాలని, ఔషదాల తయారీకి తగిన సూచనలు జారీ చేయాలని పిటిషన్ కోరింది. కోల్డ్రి స్టాక్ను స్వాధీనం చేసుకోవాలని, వాటి పంపిణీ, విక్రయాలను నిలిపివేయాలని కోరింది. మధ్యప్రదేశ్లో కోల్డ్రి దగ్గు సిరప్తో 22మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సిరప్ను సూచించిన ప్రభుత్వ వైద్యుడిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై, తమిళనాడుకి చెందిన సిరప్ తయారీదారుపై కేసు నమోదు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





