సీసీఐకి మాత్రమే పత్తిని అమ్ముకోవాలి

– రైతులకు అండగా ఉంటాం
– కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ హామీ

న్యూదిల్లీ, అక్టోబర్‌ 7: పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాతలు తక్కువ ధరకు పత్తిని బయట అమ్మవద్దని, ఆలస్యమైనా సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందంటూ ఆ సంస్థకే పత్తి అమ్మాలని రైతులకు సూచించారు. 12 శాతం కంటే తక్కువ తేమ ఉన్నా సీసీఐ కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. పంటని అమ్మడానికి 122 కొనుగోలు కేంద్రాలు ఉంటాయని, ఎవరైనా మోసం చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో కిషన్‌రెడ్డి దిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై ఆయనతో చర్చించారు. పత్తిలో తేమ 12 శాతం మించకుండా ఉండాలని, పత్తి కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని గిరిరాజ్‌ హామీ ఇచ్చారు. తేమ శాతం కొలిచే మిషన్లు కొనుగోలు కేంద్రాల్లో ఉంటాయని వెల్లడిరచారు. రైతులకు అండగా 122 సెంటర్లలో కమిటీలు ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను కలిసి తెలంగాణ పత్తి రైతుల సమస్యలను వివరించానన్నారు. తెలంగాణలో కేవలం పత్తి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడిరచారు. మహారాష్ట్ర కోలలో హై డెన్సిటీ ప్లాంటేషన్‌ చేస్తున్నారని, తెలంగాణలో ఎందుకు చేయడం లేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తనను అడుగుతున్నారని చెప్పారు. రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. పత్తిలో తేమ శాతం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన తీసుకురావాలని కోరారు. అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్‌ మిల్లులకు తీసుకురావడంతో పంట కొనుగోలులో ఇబ్బంది ఏర్పడుతోందని వివరించారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగానే పత్తిని ఏరోజు తీసుకొస్తారనేది రిజిస్టర్‌ చేసుకుంటే సమస్య ఉండదని చెప్పారు. సీసీఐ నుంచి నేరుగా రైతుల ఖాతాకు డబ్బు జమ అవుతుందని తెలిపారు. ఇతర దేశాల్లో కాటన్‌ రేటు తక్కువగా ఉందని తెలిపారు. పత్తిలో తేమ తగ్గించేందుకు రైతుల కోసం ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలని సూచించారు. మహారాష్ట్ర అకోలాలో హై డెన్సిటీ ప్లాంటేషన్‌ ద్వారా ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం పెరుగుతోందని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *