గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టేనని వ్యాఖ్యానించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనది, తమ పార్టీది ఒకే అభిప్రాయమన్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలకే తామూ కట్టుబడి ఉంటామన్నారు. బీఆర్ఎస్ నేతల వైఖరి చూస్తుంటే ’ఉల్టా చోర్ కొత్వాల్ డాంటే’ అన్నట్లుగా ఉందన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లు బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది.. ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రూ. 8వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ. 1.20లక్షల కోట్లకు పెంచలేదా? ఆనాడు కేసీఆర్ స్వయం ప్రకటిత ఇంజినీరు అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి ప్రజాధనం లూటీ చేశారని ఆరోపించారు. ఆయన కుమారుడు ఎన్డీఎస్ఏ కంటే తానే తెలివైన మేధావిగా ప్రవర్తిస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు.



