వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం

– విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ
– జర్మన్‌ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: జర్మనీ-తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైనదని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. ఐటీ, ఏరోస్పేస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫార్మా రంగాలకు ఒక మంచి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన జర్మన్‌ ఫ్రీడరిక్‌- ఎబర్ట్‌- స్టిఫ్టంగ్‌ (ఫెస్‌) ఫౌండేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ సబీన్‌ ఫాండ్రిక్‌, మిర్కో గుంథర్‌, క్రిస్టోఫ్‌ మోప్ర్‌ా తదితరులకు రాష్ట్రం అమలు చేస్తున్న సులభతర పారిశ్రామిక విధానాలను, సంక్షేమ పథకాలను వివరించారు. అత్యంత ప్రతిభావంతులైన యువత రాష్ట్రంలో ఉన్నందున నైపుణ్యాలకు కొదవలేదని తెలిపారు. ‘ఇండస్ట్రీ భాగస్వామ్యంతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ నెలకొల్పామని, పరిశ్రమలు తమకు అవసరమైన నైపుణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి నేరుగా నియమించుకునే అవకాశం ఇది కల్పిస్తుందని చెప్పారు. దిగ్గజ పారిశ్రమికవేత్త ఆనంద్‌ మహీంద్ర స్కిల్స్‌ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉన్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పరిశోధన, వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న నిపుణులకు రీ స్కిల్‌, అప్‌ స్కిల్లింగ్‌ లో ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ కేంద్రాలన్నిటినీ అడ్వాన్సుడ్‌ ట్రెయినింగ్‌ సెంటర్లు (ఏటీసీలు)గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. షాప్‌ ఫ్లోర్‌ నైపుణ్యం ఇక్కడే అందించి పరిశ్రమలకు మానవ వనరుల కొరత లేకుండా చూస్తున్నామని, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్‌ కోసం జీనోమ్‌ వ్యాలీలో ఇటీవలే ‘1 బయో’ను ఏర్పాటు చేశామని తెలిపారు. మెడికల్‌ ఫార్ములేషన్స్‌, వ్యాక్సిన్‌ పరిశోధనలకు ఇది వేదికగా ఉపకరిస్తుందని, ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా కొత్తగా ఏరోస్పేస్‌, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు దానిని అధిగమించాయన్నారు. రూ.1300 కోట్లతో ఫ్రెంచ్‌ కంపెనీ సాఫ్రాన్‌ విమాన ఇంజన్ల మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌ హాలింగ్‌ కేంద్రాన్ని నెలకొల్పిందని, రఫేల్‌ యుద్ధ విమానాల మరమ్మతులు, ఓవర్‌ హాలింగ్‌ ఇక్కడే జరుగుతాయని వెల్లడిరచారు. ఎంఎస్‌ఎంఈల కోసం నూతన విధానాన్ని రూపొందించామని, ఈ రంగంలో ఆటోమేషన్‌ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు.

ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఎంఎస్‌ఎంఈల ద్వారానే లభిస్తాయని, రాష్ట్రం ఈ రంగానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి సహకరిస్తోందని అన్నారు. నాలుగు లక్షల మంది గిగ్‌ వర్కర్ల భద్రత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో తాము మిగిలిన రాష్ట్రాలతో పోటీపడటం లేదని, తమ పోటీ దేశాలతోనే అని సీఎం రేవంత్‌ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి అద్భుతమైన ఎకో సిస్టం, చక్కని వాతావరణం వల్ల పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. డాటా సెంటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్తు అవసరాలు పెరుగుతాయని, సోలార్‌, పంప్డ్‌ స్టోరేజి విద్యుదుత్పాదన ద్వారా భవిష్యత్తులో కరెంటు కొరత రాకుండా 10 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామంటూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను శ్రీధర్‌బాబు జర్మన్‌ ప్రతినిధి బృందానికి వివరించారు. యునైటెడ్‌ నేషన్స్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్స్‌ గోల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నామన్నారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జర్మనీలో పర్యటించాలంటూ శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

టెక్నాలజీ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో తెలంగాణ-జర్మనీ మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యేలా తమ దేశంలో పర్యటించాలని జర్మన్‌ బుండెస్‌టాగ్‌ (పార్లమెంట్‌) సభ్యుడు, ఏఎఫ్‌డీ పార్లమెంటరీ గ్రూప్‌ ఫారిన్‌ పాలసీ అధికార ప్రతినిధి, ఇండో-జర్మన్‌ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ చైర్మన్‌ మార్కస్‌ ఫ్రోప్న్‌ామైయర్‌ మంత్రి శ్రీధర్‌బాబును ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్‌బాబు జనవరిలో జర్మనీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జర్మనీ ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు, అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీ నిపుణులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పారిశ్రామిక భృాగస్వామ్యం, తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, జర్మనీలో తెలంగాణ కంపెనీలకు మార్కెట్‌ యాక్సెస్‌ కల్పించడం, జర్మనీ-తెలంగాణ మధ్య సాంకేతికత బదిలీ, ద్వైపాక్షిక సహకార బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *