– పని ప్రాంతాల్లో ప్రమాదాలకు గురైతే పరిహారం
– బోరబండలో వడ్డెర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: రక్తం చెమటగా చిందించి రాళ్లను కరిగించి పటిష్టమైన నిర్మాణాలు చేసిన వడ్డెర్లు హైదరాబాద్ నగర అభివృద్ధికి వెన్నెముకలని, పీజేఆర్ హయాంలో వడ్డెర్లకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలోని జయశంకర్ కమ్యూనిటీ హాలులో వడ్డెర్ల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో వడ్డెర సంఘానికి చెందిన ప్రజలు ఈ సమావేశానికి హాజరెయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆనాడు పీజేఆర్ ఇప్పించిన ఇళ్ల పట్టాలను బీఆర్ఎస్ పాలనలో లాకున్నారని, మీ ఇళ్ల్లను కూల్చింది బీఆర్ఎస్ అని తెలిపారు. ఇప్పుడు మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. కాంగ్రెస్ అంటే పేదల పార్టీ. గ్రామాల్లో, పట్టణాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న పెద్దన్న రేవంత్ రెడ్డి.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ప్రమాద, రుణాలపై బీమా వంటి పథకాలు అందిస్తున్నాం.. ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా వేలాదిమంది మహిళలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు అని ఆమె చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇండ్లు ఇస్తున్నాం.. త్వరలో హైదరాబాదులో కూడా ఈ పథకం ప్రారంభిస్తాం.. పదేళ్లుగా ఇవ్వని రేషన్ కార్డులు ఈరోజు నాలుగు లక్షల కుటుంబాలకు ఇచ్చి సన్న బియ్యం అందిస్తున్నాం. వడ్డెరలకు లేబర్ కార్డులు ఇచ్చి రాళ్లు కొట్టే సమయంలో ప్రమాదానికి లోనైతే వారికి పరిహారం ఇస్తాం అని మంత్రి సీతక్క తెలిపారు. ఉప ఎన్నికలో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేసిందంటూ పేదల పక్షం వహించే పార్టీ కాంగ్రెసే అన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలన్నది రాహుల్ గాంధీ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేరుస్తుంది అని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా ఎఫ్ఫెనెండి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా బోరబండ సైట్ 3లో కూడా మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార కాంగ్రెస్ని గెలిపిస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుందని ఓటర్లకు వివరించారు. డమ్మీ ఈవీఎంను ప్రదర్శిస్తూ రెండో బటన్పై నొక్కి కాంగ్రెస్ను బలపరచాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




