బిజెపికి దేశ అభివృద్ధి కన్నా అధికారంపైనే మక్కువ
సీడబ్ల్యూసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్నాయి. ఆరు దశాబ్ధాల తర్వత గుజరాత్లో ఏఐసీసీ అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 2000 మంది వరకు ప్రముఖ నేతలకు ఆహ్వానం అందింది. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో 7 కీలక తీర్మానాలు చేసింది. కాగా ఈ సమావేశంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన తర్వాత గుజరాత్ లో గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించిన స్థలంగా నిలిచిందని, సబర్మతి నుంచి ఆయన సత్యాగ్రహం అనే శక్తివంతమైన సందేశాన్ని దేశానికి ఇచ్చారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ గాంధీయవాద సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని, అయితే మనం సాధించిన స్వరాజ్యం ఇప్పుడు బీజేపీ కారణంగా ప్రమాదంలో పడిందని, ఎందుకంటే వారు ప్రజాస్వామ్య విలువలను తక్కువ చేస్తూ, అభివ్యక్తి స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పింఛం కోసం క్రౌనీ క్యాపిటలిజమ్ కు ప్రాధాన్యత ఇస్తూ, సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందని భట్టి విక్రమార్క విమర్శించారు. దేశ అభివృద్ధికన్నా అధికారం మీద మక్కువ చూపుతోంది. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉపయోగ అభివృద్ధికి, అభివ్యక్తి స్వేచ్ఛకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన ప్రజాస్వామ్యానికి అంకితమై ఉందని అన్నారు.





