శాంతిచర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం..
•ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తాం
•లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నార్త్, వెస్ట్ సబ్జోనల్ బ్యూరో రూపేష్
భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న భద్రత బలగాల కూంబింగ్, కాల్పులు తక్షణమే నిలిపివేయాలని, తాము శాంతి చర్చల కోసం సిద్దంగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నార్త్, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ శుక్రవారం లేఖను విడుదల చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని యావత్ ప్రజానీకం కోరుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ బీజాపూర్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చలకు మా పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి చర్చలకు సంబంధించి మా పార్టీ కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసిందని తెలిపారు. చర్చల కోసం తమ వైపు నుంచి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో మావోయిస్టు పార్టీ తెలిపింది.
శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికి అణచివేత, హింసకాండ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని లేఖలో తెలిపారు. దీని ఫలితంగా బీజాపూర్ , తెలంగాణ సరిహద్దుల్లో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైందని ఈ ఆపరేషన్ను వెంటనే ఆపాలని బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించే మార్గాన్ని అనుసరించి సానుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థి స్తున్నట్లు మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రయత్నం సానుకూల ఫలితాలు ఇస్తుందని తెలిపారు. తుపాకీతో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కగార్ సైనిక ప్రచారాన్ని ఒక నెల పాటు వాయిదా వేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మా విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఆశతో ఎదురు చూస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కర్రెగుట్టల ఆపరేషన్లో ముగ్గురు జవాన్లకు అస్వస్థత
కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేత కోసం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు భద్రత బలగాలు అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం వలన వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వైద్యం నిమిత్తం భద్రాచలం దవాఖానకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్లు చికిత్స నిర్వహిస్తున్నారు.