– నారెడ్కో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: హైదరాబాద్ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన నారెడ్కో 15వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి ప్రణాళికా వ్యయంలో భాగంగా బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. సీవరేజి ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రభుత్వ వేలంలో ఎకరం రూ.177 కోట్లు పలికిందంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా దూసుకెళ్తుందో అర్థమవుతుందని అన్నారు. ఇతర ఏ నగరాల్లో లేనివిధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు, మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరంలోనే జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో నగరంలో అన్నీ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలని, నారెడ్కో ప్రతినిధులు సీఎస్ఆర్ నిధులను ఆ రంగాలపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. విల్లాలు, హై రైజ్ బిల్డింగులకే పరిమితం కావొద్దని, మధ్య, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయాలని సూచించారు. సంపద సృష్టికర్తలుగా రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందంటూ మీ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





