– భద్రాద్రి ఆలయ పనులకు శంకుస్థాపన
– ఉగాదినాటికి కొత్తగూడెం-భద్రాద్రి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి
– భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశం
– సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలి
– యాతాలకుంట టన్నెల్ పనులు వేగవంతం
– 50 వేలఎకరాలు సాగులోకి తీసుకురావాలి
– పాండురంగాపురం- మల్కాన్గిరి రైల్వే లైన్ మంజూరు
భద్రాచలం, ప్రజాతంత్ర ,మార్చి 16 : భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనుల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాగునీటి పనులు, భూసేకరణ, రైల్వే లైన్ పనులు, పర్యాటక అభివృద్ధి అంశాలపై కలెక్టర్ తో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. భక్తుల సేవలో ప్రభుత్వం అనే నినాదంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సకల సౌకర్యాలతో కళ్యాణం వీక్షించేలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భద్రాచలం ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.300 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, తొలి విడతలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి ప్రాకారం నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్లు ,సెంటర్ లైటింగ్, పూల మొక్కలు, సుందరీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేసేలా ముమ్మరంగా చేపట్టాలన్నారు.
జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 50 వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి అభివృద్ధికి కీలకమైన పాండురంగాపురం -మల్కానగిరి రైల్వే లైన్కు అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సారపాక వరకు భూ సేకరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాద్రి ప్రాంతంలో సాంస్కృతిక శోభ వెల్లివిరుస్తుందని, పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. అలాగే జిల్లాలో కీలకంగా ఉన్న బీపీఎల్, హెవీ వాటర్ ప్లాంట్లకు కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ త్వరితగతిని పూర్తిచేసేలా చూడాలన్నారు. జిల్లాలో రెండుచోట్ల విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, ఎయిర్పోర్టు అథారిటీ ఆ ప్రాంతాలను తిరస్కరించిందని, భద్రాచలం, కొత్తగూడెం మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన భూమిని గుర్తించాలని, సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కొత్తగూడెం-భువనగిరి రహదారి పరిధిలో భద్రాద్రి జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ కీలక ప్రాజెక్టుల అమలుపై అధికారులతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





