- రాహుల్ డిమాండ్కు కేంద్రం తలొగ్గక తప్పలేదు
- మేం అనేక రకాలుగా కసరత్తు చేసి కులగణన చేశాం..
- మా అనుభవాన్ని ఉపయోగించుకోండి
- రాష్ట్రం యూనిట్గా కులగణన చేపట్టాలి
- ఏడాది కాలపరిమితిలో గణనను పూర్తి చేయాలి
- మీడియా సమావేశంలో కేంద్రానికి సిఎం రేంవత్ రెడ్డి సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కులగణనలో తెలంగాణ యావత్ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని, రాహుల్ గాంధీ డిమాండ్కు కేంద్రం తలొగ్గక తప్పలేదని ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ మార్గనిర్దేశర ప్రకారం, తెలంగాణలో కుల గణన (caste census) ను పకడ్బందీగా నిర్వహించి, దేశానికి ఒక మోడల్గా నిలిపిందన్నారు.. గురువారం సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేశవరావు, మధుయాష్కీలు కూడా పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2011లో సేకరించిన కుల గణన వివరాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం బయట పెట్టలేదని ఆరోపించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని, నాడు ప్రజల మనస్సులోని మాటను గ్రహించి కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వొస్తే కుల గణన చేపడతామని హామీ ఇచ్చారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని మా ప్రభుత్వం కుల గణన చేపట్టిందన్నారు. అందుకే కుల గణనపై శాసనసభలో తీర్మానం చేశాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్లే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రోడ్లపై మొదలు జంతర్ మంతర్ వరకు.. అక్కడి నుంచి పార్లమెంట్ వరకు ఆందోళనలు చేశాం… మా గళం వినిపించాం… కుల గణన చేపట్టాలని మేం జంతర్మంతర్ లో చేసిన ఆందోళనకు బీజేపీ తప్ప అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. మా డిమాండ్ మేరకు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనతో వొచ్చిన ఒత్తిడి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కుల గణనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.. వందేళ్లుగా ఎవరూ చేయని కుల గణన తెలంగాణలో మా ప్రభుత్వం చేపట్టడంతో ఇప్పుడు కేంద్రం ఆ మార్గంలోకి వొచ్చింది..కుల గణనలో తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని సీఎం రేవంత్ అన్నారు.
తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు మంత్రుల కమిటీని, నిపుణుల కమిటీని నియమించామని, మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీ జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రజల డిమాండ్లను విన్నదని, ముఖ్యమంత్రిగా ఉన్న తాను కుల గణన ప్రక్రియపై 8 సార్లు స్వయంగా సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. కుల గణనను పారదర్శకంగా… ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించామని, 90 వేలకుపైగా ఎన్యుమరేటర్ల ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించారని తెలిపారు. ప్రతి పది ఎన్యుమరేటర్లపై ఒక సూపర్వైజర్ ను నియమించామని, దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.
దేశవ్యాప్తంగా కులగణనకు అనేక సవాళ్లు
దేశవ్యాప్తంగా కుల గణన (caste census) చేపట్టడానికి అనేక సవాళ్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఉన్న బోయలు కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నారని, తెలంగాణలో ఎస్టీలుగా ఉన్న లంబాడాలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారని తెలిపారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ సమస్యలు ఉన్నాయి. కుల గణన చేపట్టేందుకు మంచి కసరత్తు చేయాలి.. కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలి… నిపుణుల కమిటీని నియమించాలి..దేశవ్యాప్త కుల గణనకు విధివిధానాలు (టర్మ్స్ ఆఫ్ రిపరెన్సెస్) రూపొందించాలి. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అనుభవాన్నికేంద్రం వినియోగించాలి. మేం కుల గణన చేపట్టిన తీరు… ఇతర అంశాలపై మా దగ్గర ఉన్న సమాచారాన్నిపంచుకోవడానికి మేం సిద్దంగా ఉన్నాం. దేశ ప్రజల ప్రయోజనాల విషయంలో మేం రాజకీయాలకు పాల్పడదల్చుకోలేదు. కుల గణనను సమాజ ఎక్స్రేగా రాహుల్ గాంధీ అభివర్ణించారు…. ఎక్స్రేను చూసిన తర్వాతే చికిత్స చేయగలం. కుల గణన దేశానికి ఎక్స్ రే లాంటిది… దాని నుంచి వొచ్చే వివరాల ఆధారంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కుల గణన విషయంలో మాకు మార్గదర్శకంగా నిలిచిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు 400 సీట్లు ఇవ్వకపోవడం…. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే ఇప్పుడు కేంద్రం కులగణనకు అంగీకరించింది..
కుల గణనకు కేంద్రం అంగీకరించడం రాహుల్ గాంధీ, ఆయన చేసిన జోడో యాత్ర ఫలితం.. బీహార్ చేపట్టిన కుల గణనను కోర్టు తప్పుపట్టడంతో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ రాష్ట్రం చేపట్టిన కుల గణన అశాస్త్రీయం అని చెప్పారు… తెలంగాణది కాదు. కుల గణన చేపట్టాలనే రాహుల్ గాంధీ ఆలోచనను కేంద్రం అమలు చేస్తుంటే స్వాగతిస్తున్నాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషం. మహాత్మా గాంధీ శాంతియుత పద్ధతుల్లో విజయాన్ని సాధించారు. గాంధీ విగ్రహాన్ని హిరోషిమాలో పెట్టుకొని జపానీయులు పూజిస్తున్నారు. గాంధీ గారు ఎలా అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టలేదో… రాహుల్ గాంధీ అలానే వదిలిపెట్టరు.. ఏదో ఒక రోజు వారు అనుకున్నదానిని అందరూ పాటించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.