రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి
Hyderabad |హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని గుర్తుచేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి (సద్భావన దివస్) సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ సేవలను కొనియాడారు.
18 ఏండ్లు నిండిన వారికి వోటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం కల్పించారని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని, కంప్యూటర్ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడింది. ఇప్పుడు ఆయన స్ఫూర్తితోనే తెలంగాణను ఆర్థికంగా,సామాజికంగా ముందుకు తీసుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపాం. రాజీవ్ గాంధీని దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏళ్లు నిండిన వారు శాసన సభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.





