– హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు భూములు
– బోర్డుకు రూ.44.24 కోట్ల మేర ఆదాయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. కుత్భుల్లాపూర్ పరిథిలోని చింతల్లోని నివాస భూముల విక్రయాల నిమిత్తం సోమవారం నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర రూ.1,14,000 పలికింది. 513 గజాల విస్తీర్ణంలోని హెచ్ఐజి ఓపెన్ ప్లాట్కు ఆఫ్సెట్ ప్రైస్గా రూ.80 వేలు నిర్ధారించగా బహిరంగ వేలంలో చ.గజం రూ.1.14 లక్షలకు కొనుగోలు చేసినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్ఐజిలోనే మరో 389 చ.గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్ చదరపు గజానికి రూ.లక్ష ధర పలికిందన్నారు. మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్ల విక్రయానికి బహిరంగ వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.44.24 కోట్ల మేర ఆదాయం వచ్చింది. 27 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలం పాటలో చదరపు గజానికి సగటున రూ.91,947 ధరకు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. కేపీహెచ్బీ, గచ్చిబౌలి పరిసరాల్లోని భూములకే అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో చింతల్ ప్రాంతంలో కూడా చదరపు గజం ధర రూ.లక్ష దాటడం విశేషం. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నివాస భూములకు మంచి డిమాండ్ ఉందనడానికి ఇది నిదర్శనమని అంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





