– ‘కేర్ ఇన్సూరెన్స్ సమ్మిట్ 2025’ సదస్సులో వక్తలు
– నిర్వహించిన కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ఆరోగ్య బీమా వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్, బీమా సంస్థలు, టీపీఏల మధ్య సమన్వయం, పారదర్శక ప్రక్రియలతోపాటు నైతిక వైద్య నిర్ణయాలు మరింత బలపడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ కేర్ హాస్పిటల్స్ ‘కేర్ ఇన్సూరెన్స్ సమ్మిట్ 2025’ను హైదరాబాద్ లో శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీమా కంపెనీలు, టీపీఏలు, హాస్పిటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డాక్టర్ మేజర్ ముకుంద్ కులకర్ణి ఈ సమ్మిట్కు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ సీనియర్ నాయకత్వంతో పాటు చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్, ఫైనాన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైభవ్ జోషి, హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ చంద్, ఇన్సూరెన్స్ హెడ్ డాక్టర్ ప్రసేన్జిత్ రే, క్రెడిట్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ దత్తా పాల్గొన్నారు. అలాగే ప్రముఖ బీమా కంపెనీలు, టీపీఏల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో నైతికత, పారదర్శకత ఎంత ముఖ్యమో వివరించారు. హాస్పిటళ్లు, బీమా సంస్థలు ఒకే దిశగా పనిచేస్తేనే రోగులకు సరైన చికిత్స, న్యాయమైన ఖర్చులు, త్వరిత బీమా క్లెయిమ్ పరిష్కారం సాధ్యమవుతుందని వక్తలు చెప్పారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్ మాట్లాడుతూ, “ఆరోగ్య సంరక్షణ, బీమా రెండూ రోగుల విశ్వాసంపై ఆధారపడిన వ్యవస్థలు. హాస్పిటల్స్, బీమా కంపెనీలు, టీపీఏలు కలిసి పనిచేస్తేనే రోగులకు సరైన వైద్యం అందుతుంది. నైతిక వైద్య నిర్ణయాలు, స్పష్టమైన బిల్లింగ్, సక్రమమైన డాక్యుమెంటేషన్ ఉంటే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఈ సమ్మిట్ ఉద్దేశ్యం రోగులను కేంద్రంగా పెట్టుకుని కలిసి ముందుకు సాగడం” అని అన్నారు. బీమా ఆరోగ్య రంగాల్లో డేటా ప్రాముఖ్యతను వివరిస్తూ,ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డా. మేజర్ ముకుంద్ కులకర్ణి , ఆరోగ్య బీమా విస్తరిస్తున్న కొద్దీ పాలసీలు, రిస్క్ అంచనా మరియు చికిత్స ఫలితాల కొలతలో డేటా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రోహిణి 2.0, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్ వంటి కార్యక్రమాలు బీమా సంస్థలు–ఆసుపత్రుల మధ్య సమన్వయాన్ని, పారదర్శకతను పెంచుతున్నాయని తెలిపారు. “2047 నాటికి అందరికీ బీమా” అనే ఐఆర్ డిఏఐ లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, రోగి కేంద్రితంగా న్యాయమైన క్లెయిమ్ పరిష్కారాలు అవసరమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీమా క్లెయిమ్ల పరిష్కారం, నిబంధనల పాటింపు వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఇవన్నీ సులభంగా, వేగంగా జరిగేలా ఆసుపత్రులు–బీమా సంస్థలు కలిసి పనిచేయాలని వక్తలు సూచించారు. కేర్ ఇన్సూరెన్స్ సమ్మిట్ 2025, రోగులకు మేలు చేసేలా ఆరోగ్య–బీమా రంగాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలియజేస్తూ ముగిసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



