19‌న కేసీఆర్‌ అధ్యక్షతన బిఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ సమావేశం

భవిష్యత్‌ ‌కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం
పార్టీ సిల్వర్‌ ‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించే చాన్స్..
‌నేతలందరూ హాజరు కావాలని కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : ఈనెల 19న బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె.టి.రామారావును ఆదేశించారు. అధినేత ఆదేశాలమేరకు…ఈనెల 19న మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్‌ ‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్‌ ‌చైర్మన్లు, జిల్లా పరిషత్‌ ‌చైర్మన్లు,డిసిసిబి, డిసిఎంఎస్‌ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో కూడిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నామని కేటీఆర్‌ ‌తెలిపారు.

ఈ నెల 19న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్‌ ‌జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నామని కెటిఆర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలమీద ప్రధానంగా చర్చ జరగనుంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరగనున్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాల పై ఈ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటిఆర్‌ ‌తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ హాజరు కావాలని కెటిఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *