– రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి
అస్మిత – ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ 2025-26ప్రారంభం
క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఎల్బి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఖేలో ఇండియా- అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ 2025-26ను ముఖ్య అతిదిగా¸ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ క్రీడ కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే కాకుండా ఆత్మ రక్షణకు, ఆత్మస్థైర్యానికి ఉపయోగ పడుతుందని, ఇటువంటి క్రీడలలో విద్యార్థినులను, బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహక విధానాల వల్ల అనేక క్రీడా పోటీలు రాష్ట్రంలో నిర్వహించుకుంటున్నామని, అదేవిధంగా పలు జాతీయ అంతర్జాతీయ పోటీలకు రాష్ట్ర క్రీడాకారులు ఎంపిక అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్రీడా విధానంలో క్రీడల్లో బహుముఖంగా ప్రోత్సహించే విధంగా పటిష్టమైన నిబంధనలు రూపొందించమని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.సోనీ బాలాదేవి మాట్లాడుతూ గత ఆరు నెలల్లోనే ఖేలో ఇండియా ‘‘అస్మిత’’ రోయింగ్ ఫుట్బాల్ పోటీలు నిర్వహించుకున్నామని, అదేవిధంగా కిక్ బాక్సింగ్ పోటీలను కూడా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. 18 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా ు స్పోర్ట్స్ అథారిటీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు కార్యదర్శి మహిపాల్ ఉపాధ్యక్షుడు బాలాజీ కోశాధికారి పి.శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నరసింగరావు, శేఖర్ ,భాగ్యరాజ్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



