– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
– ప్రకృతి విపత్తుల విభాగం బలోపేతానికి ఉన్నతస్థాయి కమిటీ
– వరద పీడితులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి
– మూస పద్ధతులు వద్దు…ఆధునిక సాంకేతికతను ఉపయోగించండి
– అధికార్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ( ఐఎండీ) హెచ్చరికల నేపధ్యంలో గోదావరి కృష్ణా నదీ పరివాహాక ప్రాంతాల్లో వీలైనంతవరకు ప్రాణ , ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటి నుండే పకడ్బందీ చర్యలు తీసుకొంటూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి , కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతస్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించేదానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం ఉత్తమమని సూచించారు.
హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్దాయిలో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యలు, విపత్తుల నిర్వహణా విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమీషనర్ , అగ్నిమాపక డిజీ, విపత్తుల నిర్వహణ కమీషనర్ , కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ , నీటిపారుదల, ఆర్ అండ్ బి, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేశామని , కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ ఏడాది వర్షాకాల సీజన్ అనుకున్నదానికంటే 15 రోజుల ముందుగానే వచ్చిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వీలైనంతవరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రదేశాలలో జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో హఠాత్తుగా వచ్చే వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రభావానికి గురయ్యే వారిని గుర్తించి శాశ్వత తరలింపులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అధికార్లు చర్యలు తీసుకోవాలన్నారు.





