– తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్గౌడ్, అరికెపూడి బీఆర్ఎస్ సభ్యులే
– అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ సంచలన తీర్పు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించలేమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ కీలక నిర్ణయం ప్రకటించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈనెల 19న మరోమారు విచారణ జరగనుంది. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన సభాపతి.. బుధవారం ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్కు సంబంధించి గరువారం తీర్పు వెలువడనుంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పునిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వారిపై అనర్హత వేటు వేసేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు చూపలేదని తీర్పు సందర్భంగా స్పీకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ లు తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు ఇచ్చారు. ఈ విషయంలో స్పీకర్ ఆలస్యం చేస్తుండటంతో.. బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై పలు దఫాలుగా విచారించిన సుప్రీం ధర్మాసనం.. డిసెంబర్ 18వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్..బుధవారం ఐదుగురు ఎమ్మెల్యేల కేసులో తీర్పును వెలువరించారు.పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. ఇక, మిగిలిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో గురువారం నాడు తీర్పు వెలువరించనున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలను ఇంకా విచారించాల్సి ఉంది. వీరికి స్పీకర్ నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్గా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





