– అసెంబ్లీ మీడియా సలహా కమిటీ తొలి సమావేశంలో స్పీకర్
హైదరాబాద్, ్రపజాతంత్ర, జులై 10 : ఉభయ సభలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలని, ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఇందులో కీలక పాత్ర పోషించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ లెజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ మొదటి సమావేశం శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో బుధవారం జరిగింది. ముందుగా కమిటీ చైర్మన్, కో చైర్మన్, కమిటీ సభ్యులకు స్పీకర్, చైర్మన్, మం్రతి, సెక్రటరీలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస రెడ్డి , కో చైర్మన్ పరిపూర్ణా చారి, సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ జర్నలిస్టులుగా మీరు ఎంతో అనుభవం ఉన్నవారని, ఉభయ సభలు సజావుగా జరగడానికి తమ వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందించాలని కోరారు. అందరం కలిసి శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగి, అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని వ్యాఖ్యానించారు. శాసనసభ సమావేశాల సమయంలోనే కాదు, ఇతర సమయాలలో కూడా సభ కు సంబంధించిన వార్తలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని మీడియాకు విజ్జప్తి చేశారు. మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభ , శాసన మండలి సమావేశాలు సజావుగా నడవాలి అంటే మీడియా పాత్రనే కీలకమని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ హుందాగా నడవడానికి అన్ని విధాలుగా సహకారం అందించాలని, రానున్న రోజుల్లో రెండు సభలు ఒకే భవనంలోకి రాబోతున్నందున కొన్ని మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా కమిటీ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్నా అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శాసనసభ, శాసన మండలి వ్యవహారాలలో మీడియాకు బాధ్యతను కల్పించడానికి, మరింత పాత్రను పోషించడానికే మీడియా అడ్వైజరీ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఉభయ సభల నిర్వహణలో అందరి సహకారాన్ని కోరారు. సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులకు తగు సౌకర్యాలు, వసతులపై ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశాల సందర్భంగా జారీ చేసే పాస్ ల విషయంలో కమిటీ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, మంచి వాతావరణంలో సమావేశాలు జరిగే విదంగా అందరం కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమావేశాల సందర్భంగా కవరేజ్ చేసే మీడియా ప్రతినిధులందరికి పాస్ లు అందేలా సూచనలను అందిస్తామని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులకు అవసరమయ్యే సౌకర్యాలపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సూచనలు చేస్తామన్నారు.




