అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో హైదరాబాద్ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. దక్షిణ కొరియా లోని గుమీలో జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో సికింద్రాబాద్కు చెందిన నందిని అగసర (Nandini Agasara) మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్ లో సంచలన విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ పోటీలో ఆమె చివరి ఈవెంట్ అయిన 800 మీటర్ల పరుగులో 2:15.54 సమయంతో 885 పాయింట్లు సాధించి, మొత్తం 5941 పాయింట్లతో ఛాంపియన్గా నిలిచింది.
కాగా ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో నందిని అగసర చూపిన అసమాన ప్రతిభపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. ‘ ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పథకాన్ని సాధించి తెలంగాణ ప్రతిష్ఠను విశ్వవేదిక పై చాటి చెప్పిన అగసర నందినికి అభినందనలు’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానని తెలిపారు.




