హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ మూడోసారి ఏసీబీ విచారణకు గురువారం హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో ఆయన కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్గా పనిచేస్తూ కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా ఇప్పటికే రెండుసార్లు ఏసీబీ విచారించింది. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అర్వింద్ కుమార్ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఎఫ్ఈవో కంపెనీకి దాదాపు రూ.45 కోట్లు 71 లక్షల నగదును బదిలీ చేశారు. వాటికి సంబంధించే మూడోసారి అర్వింద్ కుమార్ను విచారణకు పిలిచి ఏసీబీ స్టేట్మెంట్ను రికార్డు చేస్తోంది. అయితే రెండుసార్లు కేటీఆర్ను విచారణ జరిపిన సమయంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా గతంలో అరవింద్ కుమార్ను, అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించారు. రేస్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ తప్పుకున్న తర్వాత కూడా నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తోంది.
ఏసీబీ విచారణకు అర్వింద్ కుమార్ హాజరు



