- కీలకమైన బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టిన అమిత్ షా
- బిల్లు ప్రతులు చించి గందరగోళం సృష్టించిన విపక్ష నేతలు
- ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆందోళన
న్యూదిల్లీ,ఆగస్ట్ 20: తీవ్ర నేరారోపణలు ఎదుర్కొనే వారికి పదవీగండం కలిగించేలా..కీలకమైన బిల్లును అమిత్ షా (Amit Shah) లోక్సభ (Lok Sabha)లో ప్రవేశ పెట్టారు. అయితే బిల్లు ప్రతులు చించి గందరగోళం సృష్టించిన విపక్ష నేతలు ఆందోళన చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆందోళన చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధాని మంత్రి దగ్గర్నుంచి ముఖ్యమంత్రిని, మంత్రులను తమ పదవుల నుంచి తొలగించే మూడు కీలక బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లులను ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులు రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత మంది ప్రతిపక్ష ఎంపీలు ఆ బిల్లు ప్రతులను చింపేసి అమిత్ షా వైపు విసిరేశారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గుజరాత్ హోం మంత్రిగా ఉండగా అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ఆ విమర్శను అమిత్ షా ఖండించారు. అరెస్ట్కు ముందే తాను తన పదవికి రాజీనామా చేశానని తెలిపారు. కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాతే తిరిగి ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు.ఈ బిల్లు ఆమోదం పొందితే నేర చరిత్ర ఉన్న నేతలకు కష్టకాలం మొదలైనట్టే. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి 30 రోజుల పాటు జైలు జీవితం గడిపితే ప్రధాన మంత్రినైనా, కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. కనీసం ఐదేళ్లు శిక్ష పడే నేరానికి పాల్పడి, 30 రోజులు జైలు జీవితం గడిపిన వ్యక్తి 31వ రోజు వారి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. తీవ్ర గందరగోళం మధ్య లోక్సభ వాయిదా పడింది.





